యుద్ధం మొదలైంది: కమలేష్ హత్యకు మేమే బాధ్యులమంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్
లక్నో: శుక్రవారం జరిగిన హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్యకు బాధ్యత తమదేనంటూ ఆల్ -హింద్ బ్రిగేడ్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్లో మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముస్లింలను తివారీ చులకన చేసి మాట్లాడటం, ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతోనే ఆయన్ను హత్య చేసినట్లు సర్క్యులేట్ అవుతున్న వాట్సాప్ మెసేజ్లో ఉంది. అంతేకాదు ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని చూస్తారని హెచ్చరిస్తూ ఉన్న మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.
ఇక ఈ మెసేజ్తో పాటు తివారీకి సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేశారు. ఇస్లాంను కానీ, ముస్లింలను కానీ తక్కువ చేసి మాట్లాడితే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. యుద్ధం మొదలైంది.. ఇలాంటివి ఇంకా చూస్తారు అని రాసి ఉంది. తివారీ హిందూ మహాసభ మాజీ సభ్యుడు. ఆ తర్వాత తను సొంతంగా హిందూ సమాజ్ పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. శుక్రవారం రోజున ఇద్దరు వ్యక్తులు ఆయన్ను కత్తితో పొడిచి చంపారు. ఆ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపుమడుగులో పడిఉన్న తివారీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే కమలేష్ హత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్లో అన్వర్ ఉల్ హక్ అనే ముస్లిం మతపెద్దను అరెస్టు చేశారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ రహస్య ప్రాంతంకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ముగ్గురు అహ్మదాబాదులోని సూరత్ ప్రాంతానికి చెందినవారు. ఇక కమలేష్ హత్యలో పాల్గొన్న వారు కూడా సూరత్కు చెందిన వారే అని గుర్తించారు.