మెజార్టీ ముందు మోకరిల్లబోతున్న కమల్నాథ్..?: బలపరీక్షకు ముందే రాజీనామా, బలం లేదని అంగీకరించిన దిగ్గీ
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. మెజార్టీ ముందు కూనరిల్లిన కమల్నాథ్ సర్కార్.. ఓటమిని ముందే అంగీకరించే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో మెజార్టీ లేనందున అంతకుముందే రాజీనామా చేయాలని కమల్నాథ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంకేతమే స్పీకర్ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడం అని అర్థమవుతోంది. కర్ణాటక మాదిరిగా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. స్పీకర్ ప్రజాపతి భావిస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ @ 92..?
22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ బలం 92కి తగ్గిపోతోంది. సభలో సభ్యుల సంఖ్య 228 నుంచి 202కి పడిపోతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్ ఫిగర్ 101 కాగా.. కాంగ్రెస్ పార్టీ 9 సీట్ల దూరంలో నిలిచిపోతోంది. 109 మంది సభ్యులతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.
మెజార్టీ లేదు...
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ సర్కార్ మెజార్టీ నిరూపించుకోదని అంగీకరించారు. ఒకవేళ బలపరీక్షకు వెళ్లిన ప్రయోజనం లేదని.. కాంగ్రెస్ విజయం సాధించబోదని ముందే అంగీకరించారు. రాష్ట్రంలో కమల్నాథ్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఒప్పుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత తమకు మెజార్టీ లేదని ముందే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
సంక్షోభం ఇలా...?
జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు ఎగరవేయడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. బెంగళూరు హోటల్లో మకాం వేశారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విఫల ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని శివరాజ్సింగ్ వేసిన పిటిషన్పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి.. శుక్రవారం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని కమల్నాథ్ ప్రభుత్వానికి స్పష్టంచేసింది.