కంబళ పరుగువీరుడు.. ఇండియన్ ఉసేన్ బోల్ట్కు ఊహించని అవకాశం..
Recommended Video
తమిళనాడులో జల్లికట్టు ఎంత పాపులరో.. కర్ణాటకలో కంబళ అంత పాపులర్. ఇప్పుడీ ప్రాచీన సాంప్రదాయ క్రీడ నుంచి ఓ పరుగుల వీరుడు పుట్టుకొచ్చాడు. ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ను తలదన్నే వేగంతో అతను పరుగుతీసిన తీరు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 9.55 సెకన్లలోనే 100మీ. దూరం పరిగెత్తిన అతన్ని.. ఇండియన్ ఉసేన్ బోల్ట్ అంటున్నారు. అంతేకాదు, భారత్ తరుపున అతన్ని ఒలింపిక్స్కి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు.
ఎవరా పరుగుల వీరుడు..
కర్ణాటకలో సాధారణంగా ప్రతీ ఏటా కంబళ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా కంబళ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న కంబళ పోటీలు నిర్వహించారు. ఇంతకీ కంబళ పోటీ ఏంటంటే.. రెండు గేదెలు లేదా దున్నపోతులతో కలిసి బురద నీళ్లలో పరిగెత్తడం.ఎవరైతే గేదెలను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు. అలాంటి ఈ పోటీలో శ్రీనివాస గౌడ(28) అనే యువకుడు కేవలం 9.55సెకన్లలోనే 100 మీ. దూరం పరిగెత్తాడు. మొత్తంగా 142.50మీ. దూరాన్ని 13.36సెకన్లలో పూర్తి చేశాడు.
దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు..
100మీ. పరుగు పందెంలో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉంది. 2009లో బెర్లిన్లో జరిగిన అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బోల్ట్ 9.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ లెక్కన బోల్ట్ కంటే శ్రీనివాస గౌడ 3 సెకన్ల ముందుగానే లక్ష్యం చేరుకున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస గౌడ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ట్విట్టర్లో పలువురు ప్రముఖులు కూడా శ్రీనివాస గౌడను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్..
ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా శ్రీనివాస గౌడపై ట్వీట్ చేశారు. 'ఒకసారి అతని దేహ దారుఢ్యం చూడండి. అథ్లెటిక్స్లో రాణించే అసాధారణ సామర్థ్యం అతనికి ఉంది. కాబట్టి కేంద్రమంత్రి కిరిణ్ రిజిజు గారు ఇప్పుడు శ్రీనివాస్ గౌడకు 100మీ.స్ప్రింట్లో ట్రైనింగ్ ఇవ్వాలి.. లేదా కంబళ క్రీడను ఒలింపిక్స్లో చేర్చాలి.అన్నింటికంటే శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ అందించాలి' అని ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా ఇదే విషయంలో కిరణ్ రిజిజుకు ట్వీట్ చేశారు.
శాయ్ నుంచి గౌడకు పిలుపు..
అటు కిరణ్ రిజిజు కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్పై సానుకూలంగా స్పందించారు. శ్రీనివాస్ను శాయ్(SAI-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు సంప్రదించారని చెప్పారు. అతనికి రైలు టికెట్ కూడా బుక్ చేశారని.. సోమవారం శాయ్ సెంటర్కు అతను వస్తున్నాడని తెలిపారు. నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.
ఐదు వరకే చదివిన శ్రీనివాస గౌడ..
ఇక శ్రీనివాస గౌడ పరుగును ఉసేన్ బోల్టుతో పోల్చడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కంబళ పోటీలో గేదెల వేగం పోటీదారులను మరింత వేగంగా పరిగెత్తేలా చేస్తుందని అంటున్నారు. అయితే బురదమళ్ల నీళ్లలోనే అంత వేగంగా పరిగెత్తినవాడు.. స్ప్రింట్లో పరిగెత్తలేడా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీనివాస గౌడ్ వ్యక్తిగత విషయాలను పరిశీలిస్తే.. అతను కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కంబళ పోటీల్లో పాల్గొంటున్నాడు.