‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కామినేని శ్రీనివాస్ కేవియట్, మస్తాన్ వలీ కూడా..
ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ పిటిషన్ వేసినందున కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోనే పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. దీనిపై హైకమాండ్తో చర్చించి.. ఆదేశాల మేరకు పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం పిటిషన్, కామినేని.. కేవియట్ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.
ఇదివరకు నిమ్మగడ్డను ఎస్ఈసీగా తొలగించడంపై కామినేని శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం.. కనకరాజు నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. అతని నియామకం కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా కొట్టివేసింది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్.. కామినేని, మస్తాన్ వలీల కేవియట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.
ఒకవేళ సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. కొత్త ఎస్ఈసీని నియమించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ఇదివరకు నిబంధనల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ పేరు తెరపైకి తీసుకొస్తారని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.