బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల ముష్టియుధ్దం, కోర్టులో హాజరైన గణేష్, గురుశిష్యుల సవాల్ !
బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీద బాటిల్ తో దాడి చేసి పిడుగుద్దులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని నమోదైన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బళ్లారి జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే కోర్టు ముందు హాజరైనాడు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం కేసు విచారణ మరో కోర్టుకు బదిలి చేసింది. బళ్లారి జిల్లాలోని విజయనగర నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద అతని శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న అదే జిల్లాకు చెందిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ దాడి చెయ్యడంతో కేసు నమోదైయ్యింది.
కోర్టులో గణేష్
కర్ణాటకలోనే సంచలనం రేపిన ఈ కేసులో విజయనగర అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో కంప్లీ ఎమ్మెల్యే గణేష్ బెంగళూరు నగర శివార్లలోని రామనగర సీజేఎం కోర్టు ముందు హాజరైనారు.
బెంగళూరు కోర్టు
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి కులకర్ణి నరహరి కేసు విచారణ బెంగళూరు నగరంలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. గురువు ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన శిష్యుడు కంప్లీ ఎమ్మెల్యే గణేష్ బెంగళూరు నగరంలోని ప్రత్యేక కోర్టులో జరిగే విచారణకు హాజరు కావడానికి సిద్దం అయ్యాడు.
ఆపరేషన్ కమల దెబ్బ
ఆపరేష్ కమల భయంతో గత జనవరి 19వ తేదీన బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ బస చేశారు. ఆ రోజు రాత్రి పోద్దుపోయిన తరువాత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఉన్న గది వైపు కంప్లీ ఎమ్మెల్యే గణేష్ వెళ్లాడు. ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన తరువాత కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
ముఖం పగిలిపోయింది
ఆ సమయంలో ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేష్ ల మధ్య మాటామాట పెరగడంతో సహనం కోల్పోయిన గణేష్ బాటిల్ తీసిన ఆనంద్ సింగ్ మీద దాడి చేశాడు. తరువాత ఆనంద్ సింగ్ ముఖం మీద పిడిగుద్దలతో దాడి చెయ్యడంతో అతని ముఖంతో పాటు శరీరం మీద తీవ్రగాయాలు కావడంతో బెంగళూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో చాల రోజుల పాటు చికిత్స పొందారు. రామనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.