కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు దాడి తీవ్రగాయాలు: కన్నీరు పెట్టుకున్న పవర్ స్టార్, మద్దతు!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని అనుచరుల దాడిలో తీవ్రగాయాలై ఇక్కడి మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్వత్ ను దివంగత డాక్టర్ రాజ్ కుమార్ కుమారుడు, స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పరామర్శించి కన్నీరు పెట్టుకున్నారు.
వైద్యులతో చర్చ
మంగళవారం బెంగళూరులోని మాల్యా ఆసుపత్రి చేరుకున్న పునీత్ రాజ్ కుమార్ నేరుగా విద్వత్ చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లారు. అనంతరం విద్వత్ ఆరోగ్య పరిస్థితిని పునీత్ రాజ్ కుమార్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పవర్ స్టార్ కన్నీరు
దాడి జరిగిన తీరును విద్వత్ వివరిస్తున్నసమయంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్వత్ చిన్నతనం నుంచి తనకు బాగా తెలుసని అన్నారు.
సొంత తమ్ముడు
విద్వత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అతను ఎంతో మంచి వాడు, తనకు సొంత తమ్ముడు లాంటివాడని పునీత్ రాజ్ కుమార్ చెప్పారు. విద్వత్ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మీడియాకు చెప్పారు.
తప్పు చేస్తే శిక్షపడాలి
చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షపడాలని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నారు. విద్వత్ కుటుంబ సభ్యులకు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ధైర్యం చెప్పారు. కచ్చితంగా మనకు చట్టపరంగా న్యాయం జరుగుతోందని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విద్వత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రాజ్ కుమార్ ఇంటి భోజనం
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో పాటు ఆయన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారులు సైతం విద్యత్ ను చూడటానికి ఇంటి నుంచి భోజనం తీసుకుని మాల్యా ఆసుపత్రికి వచ్చారు. విద్వత్ ఆరోగ్య పరిస్థితిని రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారులు అడిగి తెలుసుకున్నారు.