జయేంద్ర సరస్వతి శివైక్యంపై చంద్రబాబు-కేసీఆర్: విదేశాల నుంచి భక్తులు!
Recommended Video
కంచి/హైదరాబాద్: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నిర్యాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంచిపీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
పీఠం నేతృత్వంలో ఆయన విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. జయేంద్ర సరస్వతి శివైక్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత
1954 నుంచి కంచి పీఠాధిపతిగా
కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్యం మహదేవ అయ్యర్. పీఠాధిపతి అయిన తర్వాత జయేంద్ర సరస్వతిగా పేరు మారింది. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అనంతరం, 1954 మార్చి 24వ తేదీ నుంచి ఆయన కంచి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.
కొంతకాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు
శ్వాస సంబంధ వ్యాధితో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. కంచిలోని శంకర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మహానీర్యాణం చెందారు.
తమిళనాడులో జన్మించారు
జయేంద్ర సరస్వతి 1935 జూలై 18వ తేదీన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జన్మించారు. మన్నార్ గుడి సమీపంలోని ఇరుల్నిక్కీ గ్రామంలో జన్మించారు. ఆయన పార్థివ దేహాన్ని మఠంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో హైదరాబాదులోని మఠాన్ని మూసివేశారు.
విదేశాల నుంచి భక్తులు
జయేంద్ర సరస్వతికి హిందూ మతంపై అపారమైన జ్ఞానం ఉన్నందున ఆయన అందరిచే గౌరవించబడ్డారు. ఆయన అధ్వర్యంలొ కంచి పీఠం మరింత ఎదిగింది. ఈ మఠం విదేశాల నుండి భక్తులను కూడా ఆకర్షించింది.