కంగనా రనౌత్ కార్యాలయంలో బీఎంసీ దాడులు: కూల్చేస్తారంటూ ‘క్వీన్’ ట్వీట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విచారణపై నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శివసేన వర్సెస్ కంగనా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు దాడులు చేశారు.
ముంబై వస్తున్నా.. దమ్ముంటే అడ్డుకోండి: శివసేనకు కంగనా రనౌత్ సవాల్
బీసీఎం అధికారులు చొరబడ్డారు..
ఈ క్రమంలో కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కారుపై ఘాటుగా స్పందించారు. ‘నా కార్యాలయంలోకి బీఎంసీ అధికారులు బలవంతంగా చొరబడ్డారు. అంతా కొలిచి చూశారు. నా ఆఫీసు పొరుగున ఉన్నవారిని కూడా వేధించారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని వారిని బెదిరించారు' అని కంగన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
నా కార్యాలయాన్ని కూల్చేస్తారేమో.. కంగన
తాను తన కార్యాలయంకు సంబంధించిన సమాచారం ఇప్పటికే బీఎంసీకి ఇచ్చానని, అయినా తన కార్యాలయంపై ఇప్పుడు దాడులు జరిపారని చెప్పారు. తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయని, బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. తన ప్రాపర్టీలో ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదని స్పష్టం చేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. స్ట్రక్చర్ ప్లాన్ కూడా తీసుకురాకుండా అధికారులు ఈ రోజు తన కార్యాలయానికి వచ్చారని తెలిపింది. రేపు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆఫీసును కూల్చేస్తారని కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
బీఎంసీ అధికారులు ఇలా..
కాగా, సాధారణ సర్వేలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అనుమతులు ఉంటే అధికారులకు చూపించాలని.. లేదంటే కూల్చివేత చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు. కొంత స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోందని, అందుకే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
శివసేన నేతల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని కంగనా రనౌత్ పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం ఆమెకు తాజాగా వై కేటగిరీ భద్రతను కేటాయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వానికి కంగన కృతజ్ఞతలు తెలిపారు.