ముంబై వస్తున్నా.. దమ్ముంటే అడ్డుకోండి: శివసేనకు కంగనా రనౌత్ సవాల్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కంగనా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో వారసులు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. సుశాంత్ మృతిపై జరుగుతున్న విచారణపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.
శివసేన నేతలపై కంగన ఆగ్రహం..
ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని కంగనా రనౌత్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సొంత స్థలం మనాలీలో ఉన్న కంగనా రనౌత్ను ముంబై తిరిగి రావొద్దంటూ కొందరు శివసేన నేతలు హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై వస్తున్నా.. దమ్ముంటే అడ్డుకోండి..
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ముంబైకి వస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, దమ్ముంటే తనను ఎవరైనా అడ్డుకోండి అంటూ శివసేనకు సవాల్ విసిరారు. ఇక తాను వచ్చే సమయం కూడా చెప్తానన్నారు .ముంబై పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడిన మీరు తిరిగి ముంబైకి రావొద్దంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడంపై ఇప్పటికే ఆమె కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ముంబై.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరా?..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల తీరుపై కూడా కంగనా విమర్శలు చేశారు. తమకు బహిరంగ ముప్పు పొంచివుందని ఆమె ఆరోపించారు. అంతేగాక, రాజకీయ నాయకులు ముంబైని పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్లాగా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియా ఉందని కూడా ఆమె ఆరోపించారు.
Recommended Video
బాలీవుడ్ పెద్దలను కాపాడేందుకేనా?
కాగా, ముంబై పోలీసులపై నమ్మకం లేదంటున్న కంగనా రనౌత్.. తన సొంత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేదా కేంద్రం నుంచి రక్షణ పొందాలని సంజయ్ రౌత్ సూచించారు. తనపై అభ్యంతరకరంగా చేసిన ఓ ట్వీట్ను ముంబై కమిషనర్ లైక్ చేశారంటూ కంగనా ఆరోపించారు. అయితే, ముంబై పోలీసులు దీన్ని కొట్టిపారేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో బాలీవుడ్ పెద్దలను కాపాడేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పనిచేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు.