సిగ్గుచేటు... మరోసారి శివసేనను టార్గెట్ చేసిన కంగనా... మాజీ నేవి అధికారిపై దాడి...
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి శివసేన సర్కార్ను టార్గెట్ చేశారు. శివసేన నేతలు ఓ మాజీ నేవి అధికారిపై దాడి చేసినట్లుగా సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కంగనా.. 'సిగ్గుచేటు' అని పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో తొలినుంచి శివసేనను టార్గెట్ చేస్తూ వస్తున్న కంగనా... ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.
కంగనా తాజాగా షేర్ చేసిన ఆ వీడియోని అంతకుముందు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్కల్కర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేని ఎగతాలి చేసేలా ఉన్న ఓ కార్టూన్ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు మాజీ నేవి అధికారి మదన్ శర్మపై శివసేన మనుషులు దాడి చేశారని ఆ పోస్టులో ఆరోపించారు.
'నిన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన శివసేన... ఇప్పుడు మాజీ నేవి అధికారి మదన్ శర్మపై దాడికి దిగింది. ఆరుగురు గూండాలు శర్మపై దాడి చేయడంతో అతని కంటికి తీవ్ర గాయమైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నియంతృత్వం నడుస్తోంది.' అని ఎమ్మెల్యే అతుల్ భట్కల్కర్ తన పోస్టులో ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడు శర్మ కాందివళిలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా... శివసేనకు చెందిన కమలేష్ కదంతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై మహారాష్ట్ర మాజీ సీఎం,బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గూండాగిరిని ఆపాలని సీఎం ఉద్దవ్ థాక్రేని డిమాండ్ చేశారు.
Shame ... https://t.co/oYJpdyMAm0
— Kangana Ranaut (@KanganaTeam) September 11, 2020