కంగనా భవనం కూల్చివేతకు బ్రేక్: బోంబే హైకోర్టులో సవాల్: ఉత్కంఠత
ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్కు చెందిన ముంబై కార్యాలయం మణికర్ణిక ఫిల్మ్స్ భవనం కూల్చివేత పనులను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. కొంతభాగాన్ని నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణం అంటూ నోటీసులను జారీ చేసిన మరుసటి రోజే అధికారులు ఆ కార్యాలయం భవనం కూల్చివేత పనులను చేపట్టారు. దీన్ని సవాల్ చేస్తూ కంగనా రనౌత్ తరఫు న్యాయవాది బోంబే హైకోర్టును ఆశ్రయించారు. బీఎంసీ అధికారుల చర్యలను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని బోంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ వెంటనే భవనం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది.
కంగనా రనౌత్తో వార్: మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్ అక్రమ నిర్మాణం: కూల్చివేతకు నోటీసులు
ముంబై మహానగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ప్రకటించడం పట్ల ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అధికారులు.. మరో అడుగు ముందుకు వేశారు. మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో కంగనా రనౌత్ నిర్మిస్తోన్న భవనం అక్రమం అంటూ నోటీసులను అందజేశారు. నోటీసు ప్రతులను మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం గోడలకు అంటించారు. అక్రమ నిర్మాణం కావడం వల్ల దాన్ని కూల్చేస్తామని వెల్లడించారు. ముంబై బాంద్రా ప్రాంతంలోని పాలీ హిల్లో మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో కంగనా రనౌత్ ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేర్పులు చేశారంటూ బీఎంసీ అధికారులు మంగళవారం నోటీసులను జారీ చేశారు. మరుసటి రోజే బుల్డోజర్లతో మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం భవనానికి చేరుకున్నారు. కూల్చివేత పనులను ప్రారంభించారు. అదే సమయంలో కంగనా రనౌత్ న్యాయవాది బోంబే హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశారు. ఈ పిటీషన్పై బోంబే హైకోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. బోంబే హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయనేది ఉత్కంఠతను రేపుతోంది.
#WATCH Mumbai: Brihanmumbai Municipal Corporation (BMC) officials carry out demolition at Kangana Ranaut's property. pic.twitter.com/ztn2L0Jg54
— ANI (@ANI) September 9, 2020
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 (ఎ) కింద ఈ భవనం అక్రమ నిర్మాణం అంటూ బీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. భవనం నిర్మాణం మొత్తం నిబంధనలకు విరుద్ధంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. టాయ్లెట్ను ఆఫీస్ క్యాబిన్గా నిర్మించారని ఈ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. 24 గంటల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేకపోతే కూల్చి వేస్తామని స్పష్టం చేశారు. కంగనా రనౌత్ ప్రస్తుతం ముంబైలో లేరు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా షూటింగ్లు నిలిపివేయడంతో ఆమె తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు. ఈ ఉదయం ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి బయలుదేరారు.