ఒక్క ట్వీట్తో సోషల్ మీడియాలో భూకంపం.. తాప్సీ vs కంగనా.. క్రికెటర్లు కుక్కల్లా మొరుగుతున్నారంటూ...
ఒక్క రిహన్నా ట్వీట్ దేశంలో సోషల్ మీడియా యుద్దానికి తెరలేపింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలకు పరోక్ష మద్దతుగా ఆమె చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో భూకంపమే పుట్టించింది. రిహన్నా మద్దతును స్వాగతించేవారు కొందరైతే... భారత అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యమేంటని ప్రశ్నిస్తున్నవారు మరికొందరు... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. సచిన్ టెండూల్కర్,గౌతం గంభీర్,కంగనా రనౌత్,కరణ్ జోహార్,అజయ్ దేవగణ్ వంటి సెలబ్రిటీలు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల ట్వీట్లను తప్పు పట్టగా... తాప్సీ పన్ను,స్వర భాస్కర్,దిల్జిత్ దోసంజ్ వంటి సెలబ్రిటీలు ఆ ట్వీట్లను స్వాగతించారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్-తాప్సీ పన్నుల మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి మాటల యుద్దం రాజుకుంది.
రిహన్నాను మూర్ఖురాలా అన్న కంగనా..
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై సీఎన్ఎన్ ప్రచురించిన వార్తా కథనాన్ని రిహన్నా ట్విట్టర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 'దీనిపై ఎందుకని మనం మాట్లాడట్లేదు...' అని తన కామెంట్ను కూడా జతచేశారు. ఈ ట్వీట్పై కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'వాళ్లు రైతులు కాదు... టెర్రరిస్టులు... అందుకే ఎవరూ దానిపై మాట్లాడట్లేదు... మా దేశాన్ని నీలాంటి డమ్మీలకు అమ్మేందుకు మేం సిద్ధంగా లేము. మూర్ఖురాలా' అంటూ కంగనా ఘాటుగా స్పందించింది.
నటి తాప్సీ కౌంటర్...
రిహన్నా ట్వీట్ తర్వాత చాలామంది సెలబ్రిటీలు #Indiatogether హాష్ ట్యాగ్తో ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. భారత్ విషయంలో ఏం చేయాలో భారతీయులకు తెలుసునని... భారతీయులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు ప్రభుత్వం కూడా రైతు ఆందోళనలకు అంతర్జాతీయ సమాజ మద్దతును దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో నటి తాప్సీ స్పందిస్తూ 'ఒక్క ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్ మీ విశ్వాసాన్ని కుదిపేస్తే లేదా మీ మత విశ్వాసాన్ని దెబ్బతీయగలిగితే... అప్పుడు మీ విలువలను, వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది తప్పా ఇతరులకు పాఠాలు నేర్పడానికి టీచర్గా మారొద్దు' అంటూ ట్వీట్ చేశారు.
కంగనా vs తాప్సీ
తాప్సీ ట్వీట్కు కౌంటర్ ఇచ్చిన కంగనా... 'బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం అనేది మాతృభూమి, కుటుంబం కోసం నిలబడాలి. ఇది కర్మ లేక ధర్మమో కానీ ఉచిత సలహాలను వినకండి. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ... తాప్సీ ట్వీట్ నిజంగానే ఒకరిని కదిలించినట్లు ఉంది. అయితే ఇవి అంతగా విషపూరితంగా.. వివాస్పదంగా లేకపోతే ఇది సరదాగా ఉండేది.. అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను కంగనాకు ఆపాదిస్తూ.. 'ఆ విషయం ప్రాథమికంగా ఆమె డీఎన్ఏలోనే ఉండొచ్చు.' అని తాప్సీ ట్వీట్ చేశారు.
క్రికెటర్లపై నోరు పారేసుకున్న కంగనా...
మరోవైపు టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కూడా కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మన దేశ ఆర్థిక వ్యవస్థలో రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మన పాత్ర మనం పోషిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మనమంతా కలిసి ఉన్నప్పుడు భారత్ ఎల్లవేళలా శక్తిమంతంగా ఉంటుంది. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన టైం ఇది' అని రోహిత్ ట్వీట్ చేశాడు. దీనికి #IndiaTogether అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశాడు. ఈ ట్వీట్పై స్పందించిన కంగనా.. 'ఈ క్రికెటర్లంతా అటు ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్కు కాకుండా అంటూ..' తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కంగనా హద్దులు దాటుతోందంటూ చాలామంది నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు.ఇది వివాదాస్పద ట్వీట్ కావడంతో దీన్ని తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. కొన్ని గంటల పాటు కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతానూ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.