కన్నయ్యను భగత్సింగ్తో పోల్చిన థరూర్, బిజెపి ఫైర్
న్యూఢిల్లీ: జెఎన్యు విద్యార్థి నేత కన్నయ్య కుమార్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్.. భగత్ సింగ్తో పోల్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. థరూర్ వ్యాఖ్యల పైన బిజెపి మండిపడుతుండగా, ఈ వివాదం నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పాటిస్తోంది.
శశిథరూర్ జెఎన్యుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కన్నయ్య కుమార్ లాంటి వారు దేశద్రోహం కేసులో నిందితులుగా ఉన్నారని, నిజం చెప్పాలంటే కన్నయ్య కుమార్ ఈ కాలపు భగత్ సింగ్ అని వ్యాఖ్యానించారు.
ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ పాలన కాలంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి వారు రాజద్రోహం నేరంపై అరెస్టులు కాబడ్డవారేనన్నారు. భగత్సింగ్ వామపక్ష భావజాలంతో విదేశీ ప్రభుత్వంపై పోరాడారని, కన్నయ్య కుమార్ కేంద్రానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు.
దీనిపై బీజేపీ మండిపడింది. దేశద్రోహం కేసులో నిందితుడిని స్వాతంత్య్ర సమరయోధుడితో పోల్చడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. కన్హయ్య కుమార్ భగత్ సింగ్ అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్తివారీ స్పందిస్తూ.. దేశంలో భగత్ సింగ్ ఒక్కడేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శశిథరూర్ స్పందిస్తూ.. తాను కన్నయ్యను భగత్ సింగ్తో పోల్చలేదన్నారు. విద్యార్థుల్లో ఒకరి వ్యాఖ్యలకు స్పందనగానే తాను మాట్లాడినట్లు తెలిపారు.
పరిస్థితులు వేర్వేరు అయినా, ఇద్దరూ చిన్నతనంలోనే వామపక్ష భావజాలంతో దేశం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారని, ఇద్దరు ఇరవై ఏళ్ల వయస్సువాళ్లే అని శశిథరూర్ వివరణ ఇచ్చారు.
రాహుల్గాంధీని కలిసిన కన్నయ్య కుమార్
దేశద్రేహం కేసులో నిందితుడిగా ఉన్న కన్నయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. లుతిన్లోని రాహుల్ నివాసంలో మరో ఐదుగురు విద్యార్థి నేతలతో కలిసి కన్నయ్య ఆయనతో సమావేశమయ్యారు. బిజెపిపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ కన్నయ్య కుమార్ మద్దతు తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.