మరణించే ముందు రోజు రేస్ క్లబ్ లో రెబల్ స్టార్, సొంత గుర్రం, బెంగళూరు, మైసూరు రేసుల్లో!
బెంగళూరు: స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, మాజీ మంత్రి అంబరీష్ మృతి చెందే ముందు రోజు అనారోగ్యంగా ఉన్నా తాను ఎంతో ఇష్టపడే గుర్రపు స్వారీలు వీక్షించారని వెలుగు చూసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ప్రాణాలు వదిలిన అంబరీష్ ఒక్క రోజు ముందు ఉల్లాసంగా గుర్రపు స్వారీలు వీక్షించారని సమాచారం.
నవంబర్ 23వ తేదీ అంబరీష్ బెంగళూరు రేస్ క్లబ్ (బీటీసీ)కి భేటీ అయ్యారు. చాల సమయం క్లబ్ లోనే అంబరీష్ ఉన్నారు. అనంతరం జరిగిన గుర్రపు స్వారీలు వీక్షించి ఇంటికి చేరుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రెబల్ స్టార్ అంబరీష్ గతంలో సినిమా షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే వారు.
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మరింత బిజీ అయ్యారు. ఇంత బీజీగా ఉన్నా అంబరీష్ మాత్రం గుర్రపు స్వారీలు చూడటం వదిలిపెట్టలేదు. 1992లో బెంగళూరు రేస్ క్లబ్ లో అంబరీష్ సభ్యత్వం తీసుకున్నారు. రేస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకోకముందు అంబరీష్ గుర్రపు రేసులు వీక్షించారు.
బెంగళూరు, మైసూరులోని రేస్ క్లబ్ లో ఎప్పుడు గుర్రపు స్వారీలు జరిగినా అంబరీష్ తప్పకుండా హాజరయ్యేవారు. అంబరీష్ సూటు బూటు వేసుకుని సిగరేట్ తాగుతూ రేస్ క్లబ్ లో అటూ ఇటూ సంచరిస్తూ అందర్నీ ఆప్యాయంగా పేరు పెట్టి పలకరించేవారు.
బెంగళూరు, మైసూరులోని రేస్ క్లబ్ లో జరిగే గుర్రపు స్వారీల్లో అంబరీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. రేస్ క్లబ్ లో పనిచేసే చాల మంది సిబ్బంది పేర్లు అంబరీష్ కు గుర్తున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. బెంగళూరులోని రేస్ క్లబ్ లో అంబరీష్ కు చెందిన సోంత స్పీడ్ హాక్ అనే పెంపుడు గుర్రం ఉంది. 2018 జులైలో జరిగిన గుర్రపు పోటీల్లో అంబరీష్ సొంత గుర్రం ఒక మెడల్ గెలుచుకుంది.