కన్నడ హీరో కిచ్చా సుదీప్, ప్రియా విడాకుల కేసు వెనక్కి, అందుకే అంటున్నారు !
ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు ‘ఈగ ఫేం'కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియా రాధాకృష్ణన్ విడాకుల కేసు వివాదం సుఖాంతం అయ్యింది.
బెంగళూరు: ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు 'ఈగ ఫేం'కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియా రాధాకృష్ణన్ విడాకుల కేసు వివాదం సుఖాంతం అయ్యింది. బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కేసును సుదీప్ న్యాయవాది గురువారం (ఆగస్టు 24) వెనక్కి తీసుకున్నారు.
కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియా రాధాకృష్ణన్ విడాకులు కోరుతూ 2015లో బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో అర్జీ సమర్పించారు. అయితే కేసు విచారణకు సుదీప్ సక్రమంగా హాజరుకాలేదు. సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ వేరువేరుగా నివాసం ఉంటున్నా వారి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని సుదీప్ న్యాయవాది కోర్టులో చెబుతూ వచ్చారు.
సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ అన్యోన్యంగా ఉంటే విడాకులు కావాలని ఎందుకు అర్జీ సమర్పించారు ? కోర్టు సమయాన్ని ఎందుకు వృదా చేస్తున్నారు ? తమాషాలు చేస్తున్నారా ? అంటూ న్యాయమూర్తి గత విచారణ సమయంలో మండిపడ్డారు. ఆగస్టు 24వ తేదీ సుదీప్, ప్రియా రాధాకృష్ణన్ ఇద్దరూ కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని జూన్ 14వ తేదీ న్యాయమూర్తి హెచ్చరించారు.
సుదీప్ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకుల కేసు వెనక్కి తీసుకున్నామని ఆయన న్యాయవాది మీడియాకు చెప్పారు. తన భార్యతో వేరుగా ఉంటున్నా ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నామని, నా వ్యక్తిగత విషాయాల్లో అభిమానులు, మీడియా జోక్యం చేసుకోరాదని గతంలో సుదీప్ మనవి చేసిన విషయం తెలిసిందే.