కన్నడ హీరో మీద దాడి, నడి రోడ్డులో, గంజాయి తాగి, వెనుక అమ్మాయి !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ హీరో కోమల్ మీద బెంగళూరులో దాడి జరిగింది. మెజస్టిక్- మల్లేశ్వరం మార్గం మద్యలోని మంత్రి మాల్ సమీపంలో కారులో వెలుతున్న హీరో కోమల్ ను కిందకు దించి ఆయన మీద ఓ వ్యక్తి దాడి చేశారు. మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని డీసీపీ శశికుమార్ బుధవారం మీడియాకు చెప్పారు.
హీరో కోమల్ మీద దాడి జరిగిన కేసు విషయం గురించి డీసీపీ శశికుమార్ మీడియాతో మాట్లాడారు. కన్నడ నటుడు కోమల్ మీద దాడి చేసింది శ్రీరాంపురకు చెందిన విజి అని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని డీసీపీ శశికుమార్ అన్నారు.
విజి డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడని, అతని మీద ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ శశికుమార్ వివరించారు. మద్యం తాగిన మైకంలో ఉన్న విజి హీరో కోమల్ మీద ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని విచారణలో వెలుగు చూసిందని డీసీపీ శశికుమార్ చెప్పారు.
దర్యాప్తు పూర్తి అయిన తరువాత కోమల్ మీద ఎందుకు దాడి జరిగింది అనే విషయం తెలుస్తుందని డీసీపీ శశికుమార్ అన్నారు. ట్రాఫిక్ లో కారులో ఉన్న కోమల్ ను రెచ్చగొట్టి ఆయన కిందకు దిగిన తరువాత విజి దాడి చేశాడని, కావాలనే దాడి జరిగిందని మల్లేశ్వరం పోలీసులు సమాచారం ఇచ్చారని డీసీపీ శశికుమార్ తెలిపారు.
ఈ విషయంపై మాట్లాడిన కోమల్ తన కుమార్తెను ట్యూషన్ దగ్గర డ్రాప్ చెయ్యడానికి కారులో వెలుతున్నానని, ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ లో వెనుక నుంచి కావాలనే కారును టచ్ చేస్తూ వచ్చాడని, ప్రశ్నించిన తనను పురుష పదజాలంతో దూషించాడని, కారు దిగిన వెంటనే రక్తం వచ్చేలా దాడి చేశాడని విచారం వ్యక్తం చేశాడు.
కోమల్ సోదరుడు, ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ ఈ విషయంలో మండిపడుతున్నారు. తన సోదరుడు కోమల్ మీద దాడి చేసిన వ్యక్తి గంజాయి సేవించాడని, బైక్ లో వెనుక అమ్మాయిని కుర్చోపెట్టుకున్నాడని ఆరోపించాడు. గంజాయితో పాటు మద్యం సేవించి తన సోదరుడు కోమల్ మీద దాడి చేశాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గేష్ డిమాండ్ చేశారు.