పాక్పై వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పేది లేదన్న రమ్య
బెంగళూరు: పాకిస్థాన్పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ పార్లమెంటుసభ్యులు రమ్య తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన సొంత అభిప్రాయాలను మాత్రమే చెప్పానని తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అంతేగాక, తాను తన భారతదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను తన ఇంటిని, తాను పెంచుకునే కుక్కలను కూడా వదిలి ఎటూ వెళ్లనని తెలిపారు.
పాక్ విషయంలో తాను చెప్పిన అంశాలపై కేసు దాఖలు కావడం నిజంగా బాధాకరమని అన్నారు. కాగా, పాకిస్థాన్పై రమ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఆమెపై కర్ణాటకకు చెందిన ఓ న్యాయవాది రాజద్రోహం కేసు పెట్టారు.
మాజీ ఎంపీ, నటి రమ్యపై 'దేశద్రోహం'కేసు
ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సార్క్ దేశాల యువ పార్లమెంటేరియన్ల సమావేశానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'కొందరు అన్నట్లుగా పాకిస్థాన్ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కేంద్రమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వెళ్లడమంటే నరకానికి వెళ్లడమేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి.
పాకిస్థాన్ను పొగుడుతున్నారంటూ ఆమెపై కొందరు విమర్శలు చేశారు. అంత బాగా నచ్చితే.. అక్కడికి వెళ్లిపోవచ్చని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మరికొందరు మండిపడ్డారు.