ఆంధ్రా సరిహద్దులో ప్రముఖ మోడల్, నటి రేఖ సింధుతో సహ నలుగురి దుర్మరణం !
ప్రముఖ మోడల్, కన్నడ టీవీ సీరియల్ నటి, బెంగళూరు నివాసి రేఖ సింధు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు దగ్గర రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఆమెతో సహ నలుగురు దుర్మరణం చెందారు.
వేలూరు/బెంగళూరు: కన్నడ టీవీ సీరియల్ నటి, ప్రముఖ మోడల్ రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఐదు మంది అదృష్ణవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఘటన బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలో జరిగింది.
బెంగళూరు నగరంలోని బాణసవాడిలో రేఖ సింధు అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె అనేక కన్నడ సీరియల్స్ లో నటించారు. రేఖ సింధు ప్రముఖ మోడల్. చెన్నైలో శుక్రవారం యాడ్ ఏజెన్సీ షూటింగ్ లో పాల్గొనడానికి బెంగళూరు నగరం నుంచి నిసాన్ సన్ని కారు (నెంబర్ టీఎన్ 32, ఏఎక్స్ 6666) లో బయలుదేరారు.
రేఖ సింధుతో పాటు మరో ఐదు మంది కారులో బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరారు. ఆంధ్రప్రద్రేశ్ సరిహద్దు (చిత్తూరు జిల్లా) దాటిన తరువాత వేలూరు సమీపంలోని నేట్రాంపల్లి దగ్గర కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనింది.
ఈ ప్రమాదంలో రేఖ సింధు (22) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అభిషేక్ కుమరన్ (22), జయచంద్రన్ (23), రక్షన్ (20) అనే ముగ్గురిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలైనాయి.
విషయం తెలుసుకున్న నెట్రాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రేఖ సింధు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రేఖ సింధు కుటుంబ సభ్యులు వేలూరు చేరుకున్నారు. బెంగళూరులోని బాణసవాడిలోని రేఖ సింధు ఇంటి దగ్గర విషాదచాయలు నెలకొన్నాయి.