భారీ వర్షాలు, ఫొటోషూట్: వాటర్ఫాల్స్లో పడి సినీ దర్శకుడి జలసమాధి: రూ. కోట్లలో నష్టం!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలోని కరావళి (కోస్తా తీర ప్రాంతం)లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు మహిళలు, చిన్నారి, కన్నడ సినీ దర్శకుడు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రూ. కొన్ని కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
ఫోటో షూట్
ఉత్తర కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలుకా మిత్తబాగిలు గ్రామం సమీపంలోని ఎర్మాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి బుధవారం ఉదయం కన్నడ కనసు చిత్ర దర్శకుడు సంతోష్ శెట్టి నలుగురు స్నేహితులతో కలిసి ఫోటో షూట్ చెయ్యడానికి వెళ్లారు.
20 అడుగుల ఎత్తు
ఎర్మాయి వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటో షూట్ చేస్తున్న సమయంలో భారీ వర్షం పడటంతో సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కాలు జారి 20 అడుగుల ఎత్తు నుంచి ఎర్మాయిల్ వాటర్ ఫాల్స్ లో పడిపోయాడు. సాటి స్నేహితులు సమాచారం ఇవ్వడంతో స్థానికులు వాటర్ ఫాల్స్ లో గాలించి సంతోష్ శెట్టి మృతదేహాన్ని బయటకు తీసుకు వచ్చారు. నిర్లక్షంగా ఫోటో షూట్ చెయ్యడం వలనే సంతోష్ శెట్టి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని స్థానికులు అంటున్నారు.
రూ. 5 లక్షలు పరిహారం
భారీ వర్షాల కారణంగా మంగళూరులోని ఉదయనగరకు చెందిన మోహిని (60), కోడియాల్ బైల్ కు చెందిన ముక్తాబాయి (60) అనే ఇద్దరు మహిళలు, బెళ్తంగడి తాలుకాకు చెందిన ఓ చిన్నారి మరణించారు. మంగళూరులోని వెన్ లాక్ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులకు దక్షిణ కన్నడ జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారంగా చెక్కులు అందించారు.
ఎంపీ, ఎమ్మెల్యే భేటీ
దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్, మంగళూరు దక్షిణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే వేదవ్యాస్ భారీ వర్షాలు పడిన ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే అధికారులకు మనవి చేశారు.