రెండు రాష్ట్రాలుగా కర్ణాటక, కర్ణాటక బంద్ కు పిలుపు, ఉత్తర కర్ణాటక వద్దు, అదే జరిగితే !
బెంగళూరు: కర్ణాటకను రెండు రాష్ట్రాలుగా విభజన చేస్తే సహించమని కన్నడ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు, వాటల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కర్ణాటక బంద్ కు వాటల్ నాగరాజ్ పిలుపునిచ్చారు.
గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన వాటల్ నాగరాజ్ రాజకీయ స్వార్థం కోసం కొంత మంది నాయకులు ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యకుండా ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చెయ్యాలని వాటల్ నాగరాజ్ మనవి చేశారు.
ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలని పలువురు నాయకులు, ఆ ప్రాంతం ప్రజలు చేస్తున్న డిమాండ్ ను వాటల్ నాగరాజ్ ఖండించారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యరాదని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీ అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు కన్నడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందిస్తామని వాటల్ నాగరాజ్ అన్నారు.
ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చెయ్యరాదని డిమాండ్ చేస్తూ ఆగస్టు చివరి వారంలో కర్ణాటక బంద్ నిర్వహిస్తామని వాటల్ నాగరాజ్ అన్నారు. 2018-19 బడ్జెట్ లో కర్ణాటక ప్రభుత్వం ఉత్తర కర్ణాటకకు తక్కువ నిధులు కేటాయించిందని పలువురు నాయకులు ఆరోపిస్తూ ప్రత్యేక రాష్ట్రం నినాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు.