తమిళనాడుపై పోరు: 18న కర్ణాటక బంద్, తెర మీదికి కన్నడ సినీ పరిశ్రమ
బెంగళూరు: మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. ఈనెల 18వ తేదిన కర్ణాటక బంద్ కు వివిధ కన్నడ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కర్ఱాటక ప్రభుత్వం బంద్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి.
మంగళవారం వివిధ కన్నడ సంఘాల నాయకులు బెంగళూరు నగరంలోని ఒక ప్రయివేటు హోటల్ లో సమావేశం అయ్యారు. శాంతియుతంగా బంద్ ఎలా నిర్వహించాలనే విషయంపై చర్చించారు. తాము కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం లేదని కన్నడ వాటల్ పార్టీ నాయకుడు వాటల్ నాగరాజ్ స్పష్టం చేశారు.
మేకేదాటు రిజర్వాయర్ నిర్మించడాకి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అయితే తమిళనాడు ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కర్ణాటక బంద్ నిర్వహిస్తున్నామని పలువురు నాయకులు అన్నారు.
ఈ సమావేశంలో కన్నడ నటుడు ప్రేమ్, అఖిల కర్ణాటక డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం నాయకులు, కర్ణాటక రక్షణ వేదిక నాయకులు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు షణ్ముగప్ప, కేఎస్ఆర్ టీసీ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు అనేక కన్నడ సంఘాల ప్రతినిధులు పాల్గోన్నారు.
సమావేశం అనంతరం వాటల్ పార్టీ అధ్యక్షుడు వాటల్ నాగరాజ్ మాట్లాడుతూ - ఈనెల 18వ తేదీన జరిగే కర్ణాటక బంద్ కు అనేక సంఘాలు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. కన్నడ సినీ పరిశ్రమ, జలమండలి, కేఎస్ఆర్ టీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తున్నాయని వాటల్ నాగరాజ్ వివరించారు.
బీజేపీ మద్దతు
మేకేదాటు తాగు నీటి ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదిన నిర్వహిస్తున్న శాంతి యుత బంద్ కూ బీజేపీ మద్దుతు ఇస్తున్నదని మాజీ డిప్యూటి సీఎం, విధాన పరిషత్ లో ప్రతిపక్ష నాయకుడు కే.ఎస్. ఈశ్వరప్ప అన్నారు. బంద్ శాంతియుతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని మనవి చేశారు.