కన్నడ VS మరాఠి, బెళగావిలో ఉద్రిక్త పరిస్థితి: కన్నడిగులు అరెస్టు. ఎంఇఎస్ మహామేళ !
బెళగావిలో కర్ణాటక శాసన సభా సమావేశాలుబెళగావిని మహారాష్ట్రలో కలిపేయండి అంటూ మరాఠీల డిమాండ్కన్నడిగులు అరెస్టు, మళ్లీ చిచ్చురేపిన మరాఠీ, కన్నడ బాషలు, మహామేళ ఏర్పాటు
బెంగళూరు: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావిలో మళ్లీ రచ్చ మొదలైయ్యింది. కర్ణాటక శాసన సభా శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 13) నుంచి బెళగావిలోని సువర్ణ సౌదలో ప్రారంభం అయ్యాయి. శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఎంఇఎస్ నాయకులు మహామేళ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
బెళగావి, కారవార, నిప్పాణి, బాల్కి ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపి వెయ్యాలని, తాము కర్ణాటకలో ఉండమని, వెంటనే కర్ణాటక నుంచి ఈ ప్రాంతాలను విభజించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఇఎస్) నాయకులు మహామేళ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కర్ణాటక శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఇక్కడి మరాఠీలు ఈ రాష్ట్రానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, మా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక రక్షణా వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బెళగావిలోని చెన్నమ్మ సర్కిల్ లో టైర్లకు నిప్పంటించి ధర్నా నిర్వహించి ఎంఇఎస్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
ఎంఇఎస్ ఏర్పాటు చేసిన మహామేళకు జిల్లాధికారులు, పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు అని కన్నడిగులు ప్రశ్నించారు. కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తల ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎంఇఎస్ నిర్వహిస్తున్న మహామేళ కార్యక్రమానికి పోలీసులు గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.
బెళగావి కార్పొరేషన్ ను సూపర్ సీడ్ చేస్తారనే భయంతో మేయర్ సంజాతా బాందేకర్ మహామేళ కార్యక్రమానికి దూరం అయ్యారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరుకాకున్నా మద్దతు మాత్రం ప్రకటించారు. ఎంఇఎస్ నాయకులు దిపక్ దళవి, మాజీ శాసన సభ్యుడు మనోహర్ కిణికర, దిగంబర మనోహర కిణకర, దిగంబర పాటీల అలోజీ తదితరులు మహామేళ కార్యక్రమంలో పాల్గొన్నారు.