గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్పై అనుమానాలు: బీజేపీ సర్కార్ను కాపాడటానికే: కారు పల్టీ ఎలా: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ టాప్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై అప్పుడే రాజకీయ దుమారం ప్రారంభమైంది. వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలు అయ్యాయి. రాజకీయాలను కుదిపేసేలా కనిపిస్తోంది ఈ ఘటన. అతణ్ని తీసుకొస్తోన్న కారు ప్రమాదానికి గురి కావడం వెనుక అనుమానాలు ఉన్నాయని, వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కారు పల్టీతో అసలు కథ..
బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుందనే ఆరోపణలు అప్పుడే వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపి, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ వికాస్ దుబే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో అరెస్టయిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్ బలగాలు అతణ్ని అరెస్టు చేశాయి. ఉజ్జయినీ నుంచి కాన్పూర్కు తరలించారు. ఈ క్రమంలో అతణ్ని తీసుకొస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. పల్టీ కొట్టింది.
కారు ప్రమాదం ఎలా సంభవించింది?
ఈ ఘటన అనంతరం వికాస్ దుబే తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా.. ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో అతను మరణించాడు. వికాస్ దుబేను తరలించడానికి వినియోగించిన కారు ప్రమాదానికి గురి కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వికాస్ దుబేను తీసుకొస్తోన్న కారు మాత్రమే ఎలా పల్టీ కొట్టిందంటూ ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై బీజేపీ ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
రాజకీయ దుమారం..
వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేసిన తరువాత, ఉద్దేశపూరకంగా, కృత్రిమంగా కారు ప్రమాదాన్ని సృష్టించారంటూ ఆరోపిస్తున్నాయి. వికాస్ దుబేను విచారించింతే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయనే కారణంతోనే అతణ్ని మట్టుబెట్టారని విమర్శిస్తున్నాయి. వికాస్ దుబే ఎన్కౌంటర్ ఘటనపై సమాజ్వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన రాజకీయ నాయకుడు ఆయనే.
Recommended Video
ప్రభుత్వాన్ని కాపాడటానికే..
అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండటానికే కారు ప్రమాదాన్ని కృత్రిమంగా సృష్టించారని ఆయన ఆరోపించారు. యోగి సర్కార్ పల్టీ కొట్టకుండా ఉండటానికే కారును పల్టీ కొట్టించారని వ్యాఖ్యానించారు. వికాస్ దుబేను విచారించి ఉంటే.. యోగి ప్రభుత్వానికి నూకలు చెల్లి ఉండేవని అన్నారు. నేరస్తులు, గ్యాంగ్స్టర్లతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. అవన్నీ వెలుగులోకి రాకుండా ఉండటానికే వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు.