ఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితి
గోమాత చుట్టూ తిరుగుతోన్న రాజకీయాలు సమాజంపై ఎంత దారుణమైన ప్రభావాన్ని చూపుతుందనడానికి నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ లోని కాన్ఫూర్ లో ఘోర సంఘటన జరిగింది. ఆవును కర్రతో మందలించాడన్న కారణంగా ఓ వ్యక్తిని నడిరోడ్డుపై.. అతని భార్యబిడ్డలు చూస్తుండగానే గొడ్డును బాదినట్లు చితకబాది చంపేశారు. నిందితుడు పదే పదే గోమాత పేరును వాడటంతో చుట్టూ ఉన్నవాళ్లెవరూ ఆ దారుణాన్ని కనీసం నిలువరించలేకపోయారు. సంచలనం రేపిన ఈ సంఘటనపై కాన్పూర్ పోలీసులు చెప్పిన వివరాలివి..
మీకు గుర్తుందిగా.. జనవరి 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు -ఫోన్ నంబర్కు ముందు 0 తప్పదు
భార్య పనిచేస్తేనే తిండి
కాన్పూర్ సిటీలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ నగర్ బస్తీలో రమణ్ గుప్తా(46)అనే వ్యక్తి కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. అతనికి భార్య మాయ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. స్వస్థలం బీహార్ నుంచి ఏళ్ల కిందటే కాన్పూర్ కు వలసవచ్చిన రమణ్ గుప్తా.. ఫ్యాక్టరీల్లో చిన్నా చితకా పనులు చేసేవాడు. లాక్ డౌన్ దెబ్బకు పని కోల్పోయి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. దుర్భర పరిస్థితుల్లో.. భార్య మాయా గుప్తా నాలుగైదు ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. అలాంటి పేద కుటుంబం ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిందిలా..
పిల్లలపైకి దూసుకొచ్చిన ఆవు
స్కూళ్లు ఇంకా తెరవక పోవడంతో రమణ్ గుప్తా నలుగురు పిల్లలూ ఇంట్లోనే ఉంటున్నారు. నిన్న సోమవారం పిల్లలంతా ఇంటి ముందు రోడ్డు మీద ఆడుకుంటుండగా, ఆ సందులోకి ఓ ఆవు దూసుకొచ్చింది. భయంతో పిల్లలు గావుకేక పెట్టగా, బయటికి ఉరికొచ్చిన రమణ్ గుప్తా.. ఓ చిన్న కర్రను చేతబట్టుకుని, ఆవును మందలిస్తూ, దూరంగా తరిమేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే వీధి చివర కూర్చొని ఉన్న ఆవు యజమాని ఆయుష్ యాదవ్ ఈ సంఘటనపై అనూహ్యంగా రియాక్ట్ అయ్యాడు. యాదవ్ స్థానికంగా డైరీ ఫామ్ నడుపుతున్నాడు.
గోమాతను కొడతావేంట్రా అంటూ..
ఆవును కర్రతో మందలించావెందుకంటూ రమణ్ గుప్తాతో ఆయుష్ యాదవ్ గొడవకు దిగాడు. కొద్ది నిమిషాల వాగ్వాదం తర్వాత ఇంటికెళ్లి, ఓ దుడ్డుకర్రను తెచ్చుకున్న యాదవ్.. గుప్తాను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి చితకబాదడం మొదులుపెట్టాడు. గుప్తాను కొట్టొద్దని ఆయన భార్యాపిల్లలు యాదవ్ కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. యాదవ్ ఉన్మాదిలా రోడ్డుపైనే గుప్తాను చావబాదుతుంటే అక్కడ గుమ్మికూడిన వాళ్లలో ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదని, దీంతో అతను మరింత పైశాచికంగా వ్యవహరించాడని బాధిత కుటుంబం పేర్కొంది.
గుప్తా హంతకుడు యాదవ్ పరార్
యాదవ్ కొట్టడం ఆపేసి, దర్జాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయిన తర్వాత.. తీవ్రంగా గాయపడిన రమణ్ గుప్తాను అతని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అయుష్ యాదవ్ తన డైరీ ఫామ్ ను బంధువులకు అప్పగించి, కుటుంబంతో సహా పరారయ్యాడు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీస్ దంపతుల దారుణ హత్య -ప్రియుడితో కలిసి మైనర్ కూతురి ఘాతుకం -ఊరొదిలి పరార్