ఓవర్ లోడ్: కాన్పూర్ రైలు ప్రమాదానికి అసలు కారణం
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి అసలైన కారణం రైలులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడమేనని రైల్వే అధికారులు చెబుతున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి మరో కారణం వెలుగు చూసింది. పట్టాలు బాగా లేకపోవడమే ఈ ప్రమాదానికి అసలు కారణంగా అధికారులు భావిస్తున్నారు. తాజాగా మరో కారణం కూడా ఉందంటున్నారు.
ఈ పెను ప్రమాదం వెనకున్న అసలైన కారణం రైలులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడమేనని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన రైలులో 1,200 మంది ప్రయాణికులు ఉన్నారని అందులో సగం మంది ప్రయాణికులు అసలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా లేక జనరల్ టికెట్పై వెళ్తున్నారా అన్నది అధికారులు గుర్తించలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి కేసు ఒకటి అధికారులు గుర్తించారని, రాజారాం అనే వ్యక్తి ఇదే రైలులో ప్రయాణిస్తున్న మరదలి కోసం వెతుకుతున్నాడని, వివరాలు అడిగితే శనివారం రైలు ఎక్కిందని కానీ ఏ కోచ్లో ఉందో తెలియదని చెప్పాడని వివరించారు.
దీనిని బట్టి చూస్తే ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్లోనే ఉందని, కానీ రైలు ఎలా ఎక్కిందో తెలియడం లేదని, ఇలా టికెటు లేకుండా ఏదో ఒక కోచ్లో ఎక్కేసిన ప్రయాణికులు చాలామందే ఉంటారని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 140కి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, కాన్పూర్ రైలు ప్రమాదం ఘటన అనంతరం ఇండోర్కు చెందిన దాదాపు యాభై మంది ఆచూకీ లభించడం లేదు.