కాంతార హీరో సంచలనం..!!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కాంతారా హీరో, దర్శకుడు రిషభ్ షెట్టి.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో సమావేశం అయ్యారు.
బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో- ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. ఇప్పటికే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ఆయా పార్టీల సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ముమ్మర ప్రచారం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గె సొంతం రాష్ట్రం కావడం వల్ల.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందా పార్టీ.

రిషభ్ షెట్టి భేటీ..
ఈ పరిస్థితుల మధ్య శాండల్ వుడ్ స్టార్ హీరో కమ్ దర్శకుడు, బ్లాక్ బస్టర్ మూవీ కాంతారతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న రిషభ్ షెట్టి కీలక అడుగు వేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. రిషభ్ షెట్టి- బసవరాజ్ బొమ్మై మధ్య సమావేశం ఏర్పాటు కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

అటవీ సంబంధ సమస్యలను..
బసవరాజ్ బొమ్మైతో సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రిషభ్ షెట్టి పేర్కొన్నారు. కాంతార సినిమా చిత్రీకరణ సమయంలో తాను కర్ణాటకలోని మారుమూల అటవీ ప్రాంతాలను సందర్శించానని, అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశానని వివరించారు. ఎన్నో సమస్యలు, సవాళ్లను గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటోన్నారని తెలిపారు. అడవులకు సమీపంలో నివసిస్తోన్న గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు ఉండట్లేదని చెప్పారు.

అటవీ సిబ్బందితోనూ..
అదే సమయంలో చాలామంది అటవీ సిబ్బంది, క్షేత్రస్థాయి ఉద్యోగులను తాను కలుసుకున్నానని, విధి నిర్వహణలో వారు పరిపాలన పరమైన సమస్యలతో సతమతమౌతున్నారని రిషభ్ షెట్టి అన్నారు. చాలామందితో అటవీ శాఖ ఉద్యోగులతో మాట్లాడానని, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసినట్లు చెప్పారు.
మౌలిక వసతులపై..
మారుమూల గ్రామాలు, అడవులకు సమీపంలో ఉండే పల్లెల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వారికి ఎలాంటి సహాయ, సహాకారాలు అందించాలి?, వన్యప్రాణుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి?, అటవీ సిబ్బంది ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటోన్నారనే వివరాలను ముఖ్యమంత్రికి అందించానని అన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు రిషభ్ షెట్టి చెప్పారు.












Click it and Unblock the Notifications