హవ్వా.. రెచ్చగొట్టి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి.. శాంతి ర్యాలీలో పాల్గొన్న కపిల్ మిశ్రా
ఈశాన్య ఢిల్లీ రణరంగంగా మారేందుకు కొందరు నేతల విద్వేషపూరిత ప్రసంగాలే కారణం. అందులో ముందువరసలో నిలిచేది బీజేపీ నేత కపిల్ మిశ్రా. చాంద్బాగ్ చౌక్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేస్తున్నారని.. అనుకూలంగా నిరసన చేపట్టాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలో 42 మంది చనిపోయారు. జేటీబీ ఇతర ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకు కారణమైన.. కపిల్ మిశ్రా శనివారం శాంతి ర్యాలీలో తేలారు.
'ఢిల్లీ పీస్ ఫోరం' శనివారం జంతర్ మంతర్ వరకు ర్యాలీ తీసింది. ఇందులో బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి త్రివర్ణ పతకం చేతబట్టి, జై శ్రీరాం అని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. చెలరేగిన హింసలో 42 మంది చనిపోవడాన్ని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. అయితే హింస చెలరెగేందుకు కారణమైన కపిల్ మిశ్రా కూడా పాల్గొనడంతో రాజకీయ పార్టీలు ఏకీ పారేస్తున్నాయి. బీజేపీ, కపిల్ మిశ్రాపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి.
మరోవైపు ఆప్ నేత సంజయ్ సింగ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నేతల పేర్లు ఎఫ్ఐఆర్లో లేవని.. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో కేసు నమోదు చేసేందుకు పోలీసులు జంకుతున్నారని విమర్శించారు. పోలీసుల తీరు మారాలని, చట్టం ముందు అందరూ సమానులేనని సంజయ్ సింగ్ గుర్తుచేశారు.