‘ఆప్’ కీ కహానీ : నమ్మినవాళ్లే కొంప ముంచారు! ఇక ‘కేజ్రీ’ పని అయిపోయినట్లేనా?
అవినీతి నిర్మూలనే తన ధ్యేయమంటూ పార్టీ గుర్తుగా శుభ్రం చేసే ‘చీపురు’ను ఎంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పుడు అదే చీపురుతో తనను తానే ఊడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అనుక్షణం వెన్నంటి ఉండి, ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన నాయకుడు.. కపిల్ మిశ్రా. అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి రహిత భారతం ఉద్యమంలో పాల్గొన్న యువకుల్లో ఒకరు.
యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ లాంటి అత్యంత విశ్వాసపాత్రులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బయటకు వచ్చేసిన తరుణంలో సైతం కేజ్రీవాల్కు మద్దతుగా నిలిచిన నాయకుడు ఆయన.
అత్యంత విశ్వాసపాత్రుడే...
అలాంటి అత్యంత విశ్వాసపాత్రుడైన కపిల్ మిశ్రా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పై బాంబులు పేలుస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకుంటుండగా తాను ప్రత్యక్షంగా చూశానంటూ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు.
ఆధారాలన్నీ ‘సమర్పయామి'..
ఇప్పటికే తనవద్ద ఉన్న ఆధారాలు అవినీతి నిరోధక శాఖకు సమర్పించిన మిశ్రా, ఆ తర్వాత సీబీఐ తలుపు కూడా తట్టారు. వాటర్ ట్యాంకర్ స్కాం గురించి రెండు విభాగాలకు ఫిర్యాదు చేశారు.
ఇప్పుడేమిటి కర్తవ్యం?
కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ చీఫ్ ముకేష్ మీనా తక్షణం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయానికి వెళ్లారు. కింకర్తవ్యం? అంటూ ఆయన్ని అడిగారు. ముఖ్యమంత్రి మీద విచారణ జరిపించాలా? ఆగాలా? అనే సంశయంలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ చేతికి కూడా కేసు వెళ్తే.. ఇక ఎటూ ఆ సంస్థ చూసుకుంటుందిలే అన్న నమ్మకం కూడా కనిపిస్తోంది.
బీజేపీ ఏజెంటా?
తరచూ పత్రికల హెడ్లైన్లలో ఉండే విధంగా కామెంట్లు చేయడంలో కపిల్ మిశ్రా సిద్ధహస్తుడు. ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. 36 ఏళ్ల వయసులో అన్నాహజారే ఉద్యమంలో చేరారు. మొన్న మొన్నటి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రముఖ నాయకుల్లో ఒకరిగా పేరొందిన మిశ్రాను ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా బీజేపీ ఏజెంటు అంటూ తిట్టిపోస్తున్నారు.
కాపాడే వాడే కాటేశాడు...
ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల స్కాంపై కామన్ vs వెల్త్ అంటూ ఓ పుస్తకం సైతం రాశారు కపిల్ మిశ్రా. ప్రతిసారీ కేజ్రీవాల్ను కాపాడుతూ పార్టీ తరపున ఆయనే ప్రకటనలు చేసేవారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటివాళ్లు పార్టీ వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు చేసిన ఆరోపణలను గట్టిగా ఖండించింది కూడా ఆయనే.
ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు...
న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ను నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత న్యాయశాఖను కూడా మిశ్రాయే నిర్వహించారు. కొన్నాళ్ల తర్వాత ఆ శాఖను తీసేశారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీద తిరుగుబాటు చేయడానికి మిశ్రాకు మనసొప్పింది.
పోతే పోయారు కానీ...
నమ్మకస్తులు, విశ్వాసపాత్రులు ఒకొరొకరు పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్లడమే కాకుండా వెళ్లేముందు, వెళ్లిన తరువాత ఏకంగా తనపైనే తీవ్రమైన ఆరోపణలు చేస్తుండడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదు.
దేశాన్నే ఉడ్చేద్దామనుకుంటే...
అవినీతి నిర్మూలనే తన ధ్యేయమంటూ పార్టీ గుర్తుగా శుభ్రం చేసే ‘చీపురు'ను ఎంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పుడు అవినీతి బురద వచ్చిపడింది. దేశం మొత్తాన్ని ప్రక్షాళన చేద్దామనుకున్న ఆయన ఇప్పుడు తనను తానే అదే చీపురుతో ఊడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇన్నాళ్లూ టార్గెట్ ‘మోడీ'...
అసలే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆయనకు వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం. మొన్నటి వరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా విడిచిపెట్టే వారు కాదు. ఏ చిన్న అవకాశం చిక్కినా మోడీని ఏకేందుకు ఉపయోగించుకునే వారు.
ఇప్పుడు అంతు చూడరూ...
అలాంటిది ఇప్పుడు సొంత పార్టీ నేతలే.. అందులోనూ అత్యంత నమ్మకస్తులుగా భావించిన నాయకులే ఇప్పుడు ఆయనపైకి రాళ్లేస్తున్నారు. ‘ఇంట్లో వాళ్లే ముండ అంటే.. ' అన్నట్లు తయారైంది ‘ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం. ఇంత మంచి అవకాశం దొరికితే బీజేపీ వాళ్లు వదులుకుంటారా?