కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడంతో ఉగ్రవాదం అంతమైనట్టేనా?
చండీగఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆయన మిత్రుడు, కమేడియన్ కపిల్ శర్మ వెనుకేసుకొచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై దృష్టి పెట్టి, దాన్ని పరిష్కరించడానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలే తప్ప, సిద్ధూను విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. హర్యానా రాజధాని చండీగఢ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన ప్రకటనల గురించి ప్రస్తావించగా..ఆయన స్పందించారు. దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్య అతి తీవ్రమైనదని, దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కపిల్ శర్మ షో నుంచి సిద్ధూను తప్పించడం వల్ల దీనికి పరిష్కారం దొరికినట్టా? అని ప్రశ్నించారు.
తాను నిర్వహిస్తోన్న షో నుంచి సిద్ధూ స్వచ్ఛందంగా వైదొలగారని అన్నారు. ఆయన వైదొలగడం వల్ల గానీ, ఆయనను ఓ షో నుంచి తప్పించడం వల్ల గానీ ఉగ్రవాద సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? అని సమర్థించుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఉగ్రవాద సమస్య నుంచి యువత దృష్టిని మరల్చినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కపిల్ శర్మ తన పేరు మీద ఓ కామెడీ, టాక్ షోను నిర్వహిస్తోన్నారు. ఓ ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ఈ టాక్ షో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి సిద్ధూ ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్ మంత్రివర్గంలో స్థానం లభించిన తరువాత కూడా సిద్దూ.. ఆ కార్యక్రమానికి వెళ్తున్నారు. తాజాగా- ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆ ఛానల్ యాజమాన్యం సిద్ధూను తప్పించింది.
సిద్ధూపై ఏదైనా చర్య తీసుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కపిల్ శర్మ బదులిస్తూ.. అది తన పరిధిలో లేదని, తన షోను ప్రసారం చేస్తున్న ఛానల్ యాజమాన్యం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడిపై పాకిస్తాన్ ను తప్పుపట్టడం వల్ల ప్రయోజనం లేదని అంటూ పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే చూడాలని, ఇందులో పాకిస్తాన్ను తప్పు పట్టడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని సిద్ధూ వ్యాఖ్యానించారు.