కపిల్ సిబల్ డబుల్ రోల్: లాయర్గా అనిల్ అంబానీకి మద్దతు..పొలిటీషియన్గా విమర్శలు
ట్విటర్ వేదికగా అనిల్ అంబానీని ఓ వైపు అటాక్ చేస్తూనే మరోవైపు తన కేసులను వాదిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్పై విమర్శలు గుప్పించింది బీజేపీ. రాఫెల్ పై అనిల్ అంబానీ పాత్రను విమర్శిస్తూ ట్విటర్ వేదికగా కపిల్ సిబల్ పోస్టులు పెట్టారు. ట్విటర్లో విమర్శలు గుప్పించి అదే రోజున రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారని ఎద్దేవా చేసింది బీజేపీ.
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రెంచి పర్యటన గురించి అనిల్ అంబానీకి ముందే తెలుసని.. అందుకే ఫ్రాన్స్ రక్షణశాఖ అధికారులతో ముందుగానే సమావేశం అయ్యారంటూ అనిల్ అంబానీని ట్వీట్ల ద్వారా విమర్శించారు కపిల్ సిబల్. ప్రభుత్వం చెబుతున్నది అబద్ధమని మరోసారి రుజువైందన్నారు కపిల్ సిబల్. ఈ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే సిబల్ సుప్రీంకోర్టు హాలులోకి కేసును వాదించేందుకు వెళ్లారు.
ఇక్కడ విశేషమేమిటంటే ఓ వైపు రాఫెల్ వివాదంలో అనిల్ అంబానీ పాత్రపై విమర్శలు గుప్పించిన సిబల్...మరోవైపు అదే అనిల్ అంబానీ కంపెనీకి సంబంధించి రిలయన్స్ సంస్థ తరపున తన వాదనలు వినిపించారు. రిలయన్స్ సంస్థపై ఎరిక్సన్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. రెండు నాల్కల ధోరణితో కపిల్ సిబల్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తింది బీజేపీ.
It seems Airbus , French Government , Anil Ambani all knew that the PM will sign an MOU on his visit to France between 9th and 11th April , 2015 .
— Kapil Sibal (@KapilSibal) February 12, 2019
This Government’s lies exposed. pic.twitter.com/rJGNNycaRH
బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కపిల్ సిబల్. తాను ఓ న్యాయవాదిగా రిలయన్స్ తరపున వాదిస్తున్నానే తప్ప ఈ కేసుకు రాఫెల్కు ముడి పెట్టి చూడటం తగదని అన్నారు. రెండు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు కపిల్ సిబల్. ఓ కంపెనీకి ఎండీగా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారని ఆ కంపెనీ తరపున మాత్రమే వాదిస్తున్నానని సిబల్ స్పష్టం చేశారు. అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ సంస్థ ఓ కార్పొరేట్ కంపెనీ అని చెప్పిన సిబల్.... కార్పొరేట్ సంస్థ పరంగా ఎలాంటి కేసులు వచ్చినా గత 20 ఏళ్లుగా తానే వాదిస్తున్నట్లు కపిల్ సిబల్ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో కపిల్ సిబల్కు మద్దతుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల నిలిచారు. రాజకీయంగా అనిల్ అంబానీ పాత్రను మాత్రమే కపిల్ సిబల్ తప్పుబట్టారని... ఇక కేసులు వాదించడం తన వృత్తి అని ఇందులో భాగంగానే రిలయన్స్ కేసులను వాదిస్తున్నారని రణదీప్ సూర్జేవాలా క్లారిటీ ఇచ్చారు.