రవి కేసు ఎఫెక్ట్: గవర్నర్ను కలిసిన సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం రాజ్ భవన్ చేరుకుని రాష్ట్ర గవర్నర్ వాజుబాయ్ ఆర్.వాలను కలిశారు. ఐఏఎస్ అధికారి డి. కే. రవి కేసు విషయం గురించి సిద్దరామయ్య గవర్నర్తో చాలా సమయం చర్చించారు. తరువాత బటయటకు వచ్చిన సిద్దరామయ్య తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రవి కేసు పూర్తి వివరాలు గవర్నర్కు అందించామని, కేసు విచారణ సీఐడి చేస్తున్నదని చెప్పామని వివరించారు.
గురువారం ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ నాయకులు గవర్నర్ ను కలిసిన తరువాత శుక్రవారం సిద్దరామయ్య గవర్నర్ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకుడు హెచ్.డి. కుమారస్వామి శుక్రవారం ఉదయం బెంగళూరులో పాదయాత్ర నిర్వహించి డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఒక్కలిగుల సంఘం ఆద్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి నుండి ఫ్రీడం పార్క్ వరకు పాదయాత్ర నిర్వహించి డి.కే. రవి కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధికి లేఖ రాశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా పార్లమెంట్ సభ్యుడు డి.కే. సురేష్ శుక్రవారం సోనియాకు లేఖ రాశారు. ఐఏఎస్ అధికారి రవి కుటుంబానికి న్యాయం జరగాలంటే కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని మనవి చేశారు.
పార్లమెంట్ సభ్యుడు డి.కే. సురేష్ సోదరుడు డి.కే. శివకుమార్ సిద్దరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. మంత్రి డి.కే. శివకుమార్ మాత్రం ఐఏస్ అధికారి రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించనవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డి.కే. రవి కేసు సీబీఐకి అప్పగించాలని శుక్రవారం బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ దగ్గర ధర్నా చేస్తున్న అమ్ ఆధ్మి పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పార్టీలకు అతీతంగా మండ్య బంద్ కు పిలుపినిచ్చారు. ఈ దెబ్బతో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి మీద ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.