'కోర్టు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయ్, కరీనా కపూర్ వెళ్లొచ్చు'
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్కు చెందిన హిమాలయ వాహిని మేగ్జిన్ కవర్ పేజీలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ మార్ఫింగ్ ఫోటోను వేసిన విషయం తెలిసిందే. దీనిపై కరీనాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని విశ్వహిందూ పరిషత్ చెబుతోంది.
లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తమ సంస్థకు చెందిన మహిళా కార్యకర్తలు దీనిని వేశారని, దీని పైన కరీనాకు అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానం ఉందని చెప్పారు. ఈ విషయంలో ఆమెకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, కోర్టు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వీహెచ్పీ నేత ప్రకాశ్ శర్మ గురువారం చెప్పారు.
విశ్వహిందూ పరిషత్కు చెందిన ఆ మేగ్జిన్ కవర్ పేజీ పైన కరీనా కపూర్ మార్ఫింగ్ ఫోటో వేశారు. దాని కింద 'ధర్మాందరన్ సే రాష్ట్రాంతరన్' అని కాప్షన్ ఇచ్చారు. కరీనా కపూర్ అక్టోబర్ 16, 2012లో సైఫ్ అలీఖాన్ను వివాహం చేసుకుంది.
సైఫ్ అలీఖాన్ను వివాహం చేసుకున్న అనంతరం కరీన తన పేరును కరీనా కపూర్ ఖాన్గా మార్చుకుంది. లవ్ జిహాద్ అంటూ హిందూ యువతులను ప్రేమిస్తున్నానని చెప్పి, పెళ్లి చేసుకొని మతం మార్చుకునేలా కొందరు ముస్లీంలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ.. ఆ సంచికలో కరీనా కపూర్ ముఖ చిత్రాన్ని వేశారు. కాగా, ఈ చిత్రం పైన కరీనా కపూర్ ఇంకా స్పందించలేదు.