కార్గిల్ విజయ్ దివస్కు 20 ఏళ్లు: యుద్ధం ఎలా ప్రారంభమైంది..? ఎ కంప్లీట్ స్టోరీ
20 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజు అంటే జూలై 26న కార్గిల్ యుద్ధంలో భారత్ విజయబాహుటా ఎగురవేసింది. 1999లో జూలైలో ప్రారంభమైన కార్గిల్ యుద్దం జూలై 26న ముగిసింది. భారత జవాన్లు పాకిస్తాన్ సైన్యంను మన భూభాగంలో నుంచి తరిమి కొట్టి తిరిగి కైవసం చేసుకోవడంతో యుద్ధం ముగిసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ - భారత్ల మధ్య చెప్పుకోదగ్గ యుద్ధాలలో కార్గిల్ యుద్ధమే చివరిదిగా నిలిచింది. అంతేకాదు ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశంగా గుర్తింపు పొందాక నేరుగా యుద్ధానికి దిగడం కూడా తొలిసారి ఇదే కావడం విశేషం. అసలు కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైంది..? భారత్ ఎలా విజయం సాధించింది..?
Recommended Video
అసలు యుద్ధం ఎలా ప్రారంభమైంది..?
కార్గిల్ యుద్దం... భారత దేశ చరిత్ర ఉన్నంతవరకు గుర్తుండిపోయే యుద్ధం. 1999 జూలై 26న పాకిస్తాన్ మూకలను తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన రోజు. అసలు కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైందనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న పర్వత ప్రాంతాలను క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అయితే 1999 మేలోనే ఈ చర్యకు పాల్పడినట్లు భారత ఆర్మీ గుర్తించింది. అయితే వారు మిలిటెంట్లో లేదా ఉగ్రవాదులో అయి ఉంటారని భావించింది. పాక్ సైన్యం అని ఊహించలేదు. ఇక ఆ తర్వాత కొన్ని వారాలకు పర్వతప్రాంతాన్ని ఆక్రమించింది పాక్ సైన్యమే అని తెలుసుకున్న భారత ఆర్మీ.... వెంటనే వారిని తరిమికొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ సైన్యంను తిరిగి పంపేందుకు ఓ వైపు మిలటరీ చర్యలు మరోవైపు దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది భారత్. పాక్ పాల్పడుతున్న చొరబాటును ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లింది. పాకిస్తాన్ను ఒంటరిని చేసి విజయం సాధించింది. జూలై 26,1999లో పాక్ ఆక్రమించిన భారత భూభాగం అంతటిని మన సైన్యం తిరిగి పొందింది.ఇందుకోసం కొన్ని రోజుల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు అమరులయ్యారు.
భారత పర్వత ప్రాంతంలోకి చొరబడిన పాక్ సైన్యం
1999 మేలో కార్గిల్లో స్థానికంగా ఉండే పశువుల కాపర్లు పర్వత ప్రాంతంలో ఏదో అలజడి జరుగుతోందనే విషయాన్ని గమనించారు. భారత ఆర్మీకి సమాచారం అందించారు. దీంతో కొందరి జవాన్లను భారత ఆర్మీ పంపించింది.అయితే కొందరు చొరబాటు దారులు ఆ పర్వత ప్రాంతాల్లో తిష్ట వేశారనే నిర్ధారణకు మన జవాన్లు వచ్చారు. అయితే అప్పటికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సాంకేతికంగా బలోపేతం లేకపోవడంతో చొరబాటు దారులంతా మిలిటెంట్లుగా భావించింది ఆర్మీ. పాకిస్తాన్ బయటనుంచి విధ్వంసం చేసే ఉగ్రవాదులుగా భావించింది. అయితే వారిని మట్టుబెట్టాక వారి దగ్గరున్న డైరీలు, ట్యాగులు చూశాక వారు ఉగ్రవాదులు కాదు, పాక్ సైనికులన్న విషయాన్ని నిర్ధారించింది ఆర్మీ. ఇదిలా ఉంటే కార్గిల్లోకి తాము చొరబడలేదంటూ పాకిస్తాన్ ఆర్మీ బుకాయించింది. అంతేకాదు మృతి చెందిన వారు తమ ఆఫీసర్లు కాదని అసలు తమ సైన్యంకు సంబంధించిన వారు కాదంటూ అబద్ధాన్ని బలపర్చింది. మృతి చెందిన పాక్ జవాన్లను భారత ఆర్మీ ఓ ప్రదేశంలో పూడ్చింది. దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టిన ఫోన్ సంభాషణ
ఇక అప్పటి వరకు మాటల యుద్ధం జరిగింది. ఒక్కసారిగా పాకిస్తాన్కు చెందిన ఫోన్ సంభాషణగల టేప్ బయటపడటంతో ఇక పాకిస్తాన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ జనరల్ ముషారఫ్ మరో ఉన్నతాధికారి మధ్య జరిగిన సంభాషణలు ఆ ఫోన్ రికార్డింగ్లో బయటపడ్డాయి. ఈ సంభాషణలను భారత బాహ్య ఇంటెలిజెన్స్ శాఖ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) పసిగట్టి బయటపెట్టింది. అందులో ముషారఫ్ మరో సీనియర్ అధికారి కార్గిల్ యుద్ధంపై మాట్లాడటం స్పష్టంగా వినిపించింది. దీంతో కార్గిల్లో కుట్ర చేసేందుకు పాక్ పన్నాగం పన్నిందని బట్టబయలైంది.
భారత జవాన్ల దెబ్బకు వణికిపోయిన పాక్ సైన్యం
ఇక భారత ఆర్మీ పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వతప్రాంతాలను తిరిగి కైవసం చేసుకునేందుకు కొన్ని బలగాలను అక్కడకు పంపింది. తమ వెంట బోఫోర్స్ గన్స్ తీసుకెళ్లారు. దీంతో పాకిస్తాన్ కూడా ఎదురుదాడికి దిగింది. కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. అయితే టోలోలింగ్ పర్వత ప్రాంతం ముందుగా దక్కించుకోవడంతో భారత విజయంలో తొలి అడుగుపడింది. శ్రీనగర్-కార్గిల్-లేహ్లను అనుసంధానం చేసేదే టోలోలింగ్ పర్వత ప్రాంతం. ముందుగా ఈ హైవేను ధ్వంసం చేస్తే భారత్కు అవకాశం ఉండదని భావించింది పాక్ సైన్యం. అయితే పాకిస్తాన్ పప్పులు ఇక్కడ ఉడకలేదు. 1999 జూన్ 13న భారత ఆర్మీ టోలోలింగ్ హైవేను తమ అధీనంలోకి తీసుకుంది. ముందుగా ఆర్మీతోనే యుద్ధం ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్ భారత నేవీలు కూడా రంగంలోకి దిగాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శతృవులు ఉన్న ప్రదేశంలో విమానం నుంచి బాంబులను కిందకు విసిరింది. అయితే అది భారత గగనతలం నుంచే జారవిడిచింది.ఇక అరేబియన్ సముద్రం తీర ప్రాంతంలో భారత నేవీ గస్తీ ప్రారంభించింది. పాక్ పోర్టులను లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల ప్రభావం ఎలా ఉన్నిందంటే ఇంకొన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్లో మరో వారం రోజులకంటే ఎక్కువగా ఇంధనం ఉండేది కాదని స్వయంగా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ ప్రకటన చేశారు.
నవాజ్ షరీఫ్తో బిల్ క్లింటన్ ఏమని చెప్పి సంతకం చేయించారు..?
ఇక మిలటరీ చర్యతో పాటు దౌత్యపరమైన చర్చలు కూడా జరిపి అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరిని చేసింది భారత్. ఇక భారత్ యుద్ధం ఆపాల్సిందిగా చెప్పాలంటూ పాకిస్తాన్ పాశ్చాత్యదేశాలతో పాటు చైనా సహకారాన్ని కోరింది. అయితే పాక్కు ఆశించినంత స్థాయిలో మద్దతు లభించలేదు. అంతేకాదు వివాదాస్పదమైన ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కు రప్పించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని కోరాయి ఈ దేశాలు. ఇక దౌత్యపరమైన చర్చలకు జూలై తొలివారంలో తెరపడింది. అమెరికా జోక్యం చేసుకుని పాక్ వెంటనే తన బలగాలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించింది. అదే నెలలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ని కలిసేందుకు నవాజ్ షరీఫ్ అమెరికాకు వెళ్లారు. అణ్వాయుధాలు పాక్ తయారు చేస్తోందన్న సమాచారం బిల్ క్లింటన్కు చేరింది. ఇక అదేసమయంలో పాక్ బలగాలను వెనక్కు పంపిస్తామని చెబుతూ తయారు చేసిన డాక్యుమెంట్పై నవాజ్ షరీఫ్ సంతకం చేయాల్సిందిగా బిల్ క్లింటన్ ఆదేశించారు. దీంతో నవాజ్ షరీఫ్ సంతకం చేయక తప్పలేదు.
ఆ తర్వాత కొన్ని రోజులకు కార్గిల్ యుద్ధం కొనసాగింది. అన్ని ప్రాంతాలను భారత్ తన అధీనంలోకి తీసుకున్నాక 1999 జూలై 26న యుద్ధం ముగిసింది. భారత్ త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అందుకే జూలై 26న విజయ్ దివాస్గా జరుపుకుంటాం.