కార్గిల్ విజయ్ దివాస్: పాకిస్తాన్ను చీల్చి చెండాడిన భారత బలగాలు
Recommended Video
19 ఏళ్ల కిందట సరిగ్గా జూలై 26న కార్గిల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ పాల్పడిన అరాచక క్రీడను తిప్పికొట్టింది భారత సైన్యం. కశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి మన భారత జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్ పై భారత్ సాధించిన గొప్ప చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటున్నాం.
మూడు నెలల పాటు భారత జవాన్లు పాకిస్తాన్పై పోరాడారు. కశ్మీర్లో కొందరు ఉగ్రవాదులను పంపి ఆ హిమ ప్రదేశం తమదేనని ప్రపంచానికి చాటుకోవాలని చూసిన పాకిస్తాన్కు భారత ఆర్మీ సరైన సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే 490 మంది అధికారులు, సైనికులు అమరులయ్యారు.
ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్పై భారత బలగాలు సత్తా చూపాయి. ముందుగా యుద్ధం సమయంలో పాక్ చొరబాటు దారులను ఏరివేసి టైగర్ హిల్ ప్రాంతాన్ని భారత్ అధీనంలోకి తీసుకున్నాయి. 1971 యుద్ధం తర్వాత జరిగిన యుద్ధం కావడంతో ఇండియా పాకిస్తాన్ వార్ను ప్రపంచదేశాలు ఆసక్తితో తిలకించాయి. యుద్ధం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జరిగినందున భారత జవాన్లు చాలా కష్టపడాల్సివచ్చింది.
అసలు యుద్ధం ఎలా వచ్చింది అనేది ఒకసారి చూస్తే... 1999వ సంవత్సరం మే మొదటివారంలో భారత భూభాగంలోకి కొందరు పాకిస్తాన్ నుంచి చొరబడినట్లు సమాచారం భారత అధికారులకు అందింది. చొరబడిన వారు ముజాహిద్దీన్ ఉగ్రవాదులై ఉంటారని అధికారులు తొలుత భావించారు. కానీ వారు ఉగ్రవాదులు కాదని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులుగా అధికారులు గుర్తించారు.
వారిని తరిమి కొట్టేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. కశ్మీర్ లడఖ్లను వేరు చేసి భారత బలగాలను సియాచిన్ గ్లేసియర్ నుంచి తరిమివేయాలనే ప్రణాళిక లేదా వ్యూహాన్ని పాక్ రచించింది.ఇలా చేయడం వల్ల ప్రపంచదేశాలు కూడా కశ్మీర్ సమస్యపై దృష్టి సారించి త్వరతగతిని ఒక పరిష్కారం చూపుతాయని పాక్ భావించింది.
ఇక యుద్ధానికి దిగాలంటే భారత్కు అన్నివైపులా కష్టాలు వెంటాడాయి. అలా అని భారత భూబాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కశ్మీర్ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక అక్కడ ఉన్న రెండు జాతీయ రహదారులు కూడా నిత్యం రద్దీగా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి వాణిజ్యం వ్యాపారాలు జరగాలన్నా ఈ రహదారులే అత్యంత కీలకం. ఇక ఇదే భారత బలగాలకు దారి.
ఈ జాతీయ రహదారిపైకి పాకిస్తాన్ కాల్పులు జరిపింది. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో చాలా మంది పౌరులకు గాయాలయ్యాయి. దీంతో అధికారులు మరో రహదారిని ఏర్పాటు చేసి పౌరులను ఆ రహదారి నుంచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ద్రాస్ సెక్టార్లో భారత బలగాలు ఆయుధాలతో పాటు మోహరించి ముందుగా అక్కడ నక్కి ఉన్న పాక్ బలగాలపై దాడి చేశారు. ఆ ప్రాంతాన్ని భారత బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఇక అంతర్జాతీయ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో తమ బలగాలను విరమించుకుంది. ఇక జూలై చివరి వారంలో భారత బలగాలు చివరిసారిగా పాక్పై దాడి చేశాయి. ద్రాస్ సెక్టార్లో పాక్ బలగాలు వెనక్కు వెళ్లిపోయాయని నిర్ధారణ చేసుకున్నాక జూలై 26న భారత్ కాల్పులు విరమించింది.
యుద్ధంలో పాల్గొన్న భారత ఆర్మీ జవాన్లు, వీరమరణం పొందిన సైనికులను స్మరించుకునేందుకే ప్రతి ఏటా విజయ్ దివస్ను జరుపుతుంది ప్రభుత్వం. ఇది దేశవ్యాప్తంగా ఆర్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.