'బంగ్లాదేశ్'కు ప్రతీకారం 'కార్గిల్', మోడీ అయినా..: ముషారఫ్ సంచలనం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో చెప్పాడు! ప్రతి దానికి టిట్ ఫర్ టాట్ (దెబ్బకు దెబ్బ) ఉంటుందని, బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారతదేశం పాత్ర ఉందని, అందుకే కార్గిల్ యుద్ధం వచ్చిందని అతను చెప్పాడు.
బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించిందని, అందుకు ప్రతీకారంగానే ఈ యుద్ధం జరిగిందని వెల్లడించాడు. ఆయన కరాచీలో ఓ టీవీ చానల్తో మాట్లాడాడు. బంగ్లాదేశ్ ఆవిర్భావంలో పాత్ర పోషించడమే కాకుండా, సియాచిన్ పైన పట్టుకు పాకులాడుతోందన్నాడు.
ఇలాంటివి అనేక చర్యలే కార్గిల్ పోరుకు దారి తీశాయన్నాడు. భారత్తో ప్రతి అంశంలోనూ దెబ్బకు దెబ్బ తరహాలోనే వ్యవహరించాలని తాను నమ్ముతున్నానని చెప్పాడు. భారత్తో సంబంధాల పైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించాడు.
చర్చల అంశంలో భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, పాకిస్థాన్ రెండు అడుగులు ముందుకేస్తుందన్నాడు. భారత్తో పాకిస్తాన్ చెలిమి సమాన హక్కుల ప్రాతిపదికనే సాధ్యమవుతుందన్నాడు. ప్రజలు, నేను భారత్తో మైత్రికి వ్యతిరేకమని భావిస్తారని, కానీ అది తప్పన్నాడు.
తన హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవన్నాడు. కాశ్మీర్, సర్క్రీక్, నీటి ఒడంబడిక వంటి అంశాలు పరిష్కారం ముంగిట నిలిచాయన్నాడు. భారత్ను నరేంద్ర మోడీ సర్కారు పాలిస్తున్నా రెండు దేశాల మధ్య చెలిమి సాధ్యమే అన్నాడు. అయితే, భారత్ దూకుడు ప్రదర్శిస్తే, తాము కూడా అదే రీతిలో స్పందిస్తామన్నాడు.
కాగా, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్ ముషారఫే. అతను అప్పుడు పాక్ ఆర్మీకి చీఫ్గా ఉన్నాడు. ముషారఫ్ ప్రస్తుతం రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్నాడు.