చిక్కుల్లో ట్రబుల్ షూటర్, మనీ ల్యాండరింగ్ కేసు సీబీఐకి, బీజేపీ దెబ్బకు విలవిల !
బెంగళూరు: అక్రమ నగదు లావాదేవీలు చేశారని (మనీ ల్యాండరింగ్) ఆరోపణలు రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. డీకే శివకుమార్ కేసు సీబీఐ చేతికి వెళితే ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.
యూట్యూబ్ పాట మహిళ ప్రాణం తీసిందా, భర్త, పిల్లలు ఏం చేశారు, ఫ్రెండ్ కోసం !
రూ. 8 కోట్లు తెచ్చిన సమస్య
2017 ఆగస్టులో ఢిల్లీలోని డీకే. శివకుమార్ ఇంటిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో డీకే శివకుమార్ ఇంటిలో రూ. 8.50 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదుకు డీకే. శివకుమార్ సరైన లెక్కలు చూపించలేదని ఐటీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఐటీ, ఈడీ దెబ్బ
ఐటీ శాఖ అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను విచారణ చేశారు. ఆగస్టు 30వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు విచారణ చేసి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు చివరికి డీకే. శివకుమార్ ను సెప్టెంబర్ 3వ తేదీ అరెస్టు చేశారు. 14 రోజుల పాటు డీకే శివకుమార్ ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆయన్ను విచారణ చేశారు.
తీహార్ జైల్లో ట్రబుల్ షూటర్
కస్టడీ గడువు పూర్తి కావడంతో ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ప్రస్తుతం తీహార్ జైల్లో డీకే. శివకుమార్ విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. డీకే. శివకుమార్ కు బెయిల్ ఇస్తే ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వరాదని ఈడీ అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చిక్కుల్లో డీకే
డీకే. శివకుమార్ అక్రమ నగదు లావాదేవీల కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈడీ దగ్గర ఉన్న కేసు సీబీఐ చేతికి వస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు మరన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 15వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో డీకే శివకుమార్ ను తీహార్ జైలుకు పంపించారు.
సీబీఐ చేతికి కేసు
డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, తమ్ముడు, కాంగ్రెస్ ఎంపీ, డీకే. సురేష్, మామ తిమ్మయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ చేశారు. మొత్తం మీద సీబీఐ అధికారుల కేసు విచారణ చేపడితే మరి కొంత మంది ఈ కేసులో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం.