సర్కార్ మెడకు మరో మత వివాదం: కాక పుట్టిస్తోన్న ఏసుక్రీస్తు విగ్రహ నిర్మాణం: 114 అడుగుల ఎత్తు..!
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మతానికి సంబంధించిన అంశం ఒకటి కాక పుట్టిస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం కపాల బెట్టపై ఏసుక్రీస్తు విగ్రహాన్ని నిర్మించడానికి తల పెట్టడం పట్ల హిందుత్వవాదులు మండిపడుతున్నారు. 114 అడుగుల ఎత్తు ఉన్న జీసస్ విగ్రహాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు కూడా కొనసాగుతుండటం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని నిరసిస్తూ ప్రదర్శనలు, ధర్నాలు మొదలయ్యాయి.
Varanasi: కాశీ విశ్వనాథుడిని దర్శనానికి నిబంధనలు: అవి లేకుంటే అడుగు కూడా పెట్టనివ్వరు.. !
డీకే శివకుమార్ ఇలాకాలో..
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ సొంత నియోజకవర్గం కనకపురలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఆయనే ఈ విగ్రహాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కనకపుర సమీపంలోని కపాల బెట్టపై 114 అడుగుల ఎత్తుగల జీసస్ విగ్రహాన్ని నిర్మించడానికి రామనగర జిల్లా పాలనా యంత్రాంగం అనుమతి ఇవ్వడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. హిందుత్వ ప్రతినిధిగా చెప్పుకొంటున్న బీజేపీ.. తన ప్రభుత్వ హయాంలో అన్యమతాన్ని ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రామనగర ఐకన్గా..
హైదరాబాద్ అనగానే.. చార్మినార్, గోల్కొండ, బుద్ధ విగ్రహం ఎలా గుర్తుకు వస్తాయో.. అదే తరహాలో రామనగరలో జీసస్ విగ్రహాన్ని నెలకొల్పడానికి డీకే శివకుమార్ ఇదివరకే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. అనంతరం అందలాన్ని అందుకున్న బీఎస్ యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా ఈ ప్రతిపాదనలు అటకెక్కకపోవడం, పైగా అనుమతులు మంజూరు కావడం విమర్శలకు కేంద్రబిందువుగా మారింది.
మండిపడుతున్న సంఘ్ పరివార్..
కపాల బెట్టపై ప్రతిపాదిత ఏసు విగ్రహం నిర్మాణాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), హిందూ జాగారణ్ వేదిక ప్రతినిధులు సోమవారం కనకపురలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కనకపుర వీధులు కాషాయమయం అయ్యాయి. కాషాయ దుస్తులు ధరించి, తలపై టోపీలు, చేతుల్లో జెండాలను ధరించి సంఘ్ పరివార్ కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. కనకపుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్..
సంఘ్ పరివార్ ప్రదర్శనలకు కర్ణాటక సమతా సైనిక దళ్ మద్దతు ఇచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనల్లో పాలు పంచుకున్నారు. ఏసుక్రీస్తు నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన పదెకరాల స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘ్ పరివార్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఏసుక్రీస్తు విగ్రహం నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని పట్టుబట్టారు. డీకే శివకుమార్, కాంగ్రెస్తో పాటు బీజేపీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందుత్వ ఉనికి కోల్పోవడం ఖాయమంటూ..
ఏసుక్రీస్తు విగ్రహ నిర్మాణం పూర్తయి.. దాన్ని కపాల బెట్టపై ప్రతిష్ఠిస్తే.. హిందుత్వం ఉనికి ప్రమాదంలో పడుతుందని సంఘ్ పరివార్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కపాల బెట్టకు ఉన్న చరిత్ర రూపుమాసిపోతుందని చెబుతున్నారు. కపాల బెట్ట కాస్తా క్రైస్తవుల పుణ్యక్షేత్రంలా మారుతుందని, ఫలితంగా- రామనగర జిల్లా వ్యాప్తంగా మత మార్పిళ్లు తీవ్రతరమౌతాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.