ఘాట్ రోడ్డులో అదుపు తప్పి..కొండను ఢీ కొట్టి: బస్సు నుజ్జునుజ్జు: 11 మంది పర్యాటకులు దుర్మరణం
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన 11 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతులందరూ ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగులు. వారందరూ ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పర్యటక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.
మైసూరులోని కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోన్న 40 మంది ఉద్యోగులతో కూడిన డీబీ ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళూరుకు బయలుదేరి వెళ్లింది. మంగళూరు బీచ్ అక్కడి నుంచి ఉడుపికి వెళ్లాలనేది వారి షెడ్యూల్.
మైసూరు నుంచి బయలుదేరిన కొన్ని గంటల్లోనే బస్సు ప్రమాదానికి గురైంది. సాయంత్రం 7 గంటల సమయంలో కర్కల సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద బస్సు అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న కొండను ఢీ కొట్టింది. అదే వేగంతో ఒరుసుకుంటూ దూసుకెళ్లింది.
ఈ ఘటనలో కుడి వైపు బస్సు మొత్తం నుజ్జునుజ్జయింది. కుడివైపున కిటికీ వైపు కూర్చున్న ప్రయాణికులందరూ మరణించారు. తొమ్మిది మంది సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని మంగళూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.