సీఐడీ డీఎస్పీ అనుమానాస్పద మృతి: ముందురోజు రాత్రి ఫ్రెండ్ ఇంట్లో మందు పార్టీ: భర్త హైదరాబాద్లో
బెంగళూరు: కర్ణాటక పోలీస్ శాఖలో కలకలం చెలరేగింది. సీఐడీ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తోన్న లక్ష్మి అనే మహిళా అధికారిణి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన స్నేహితురాలి ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె కనిపించారు. ఈ ఘటన కర్ణాటక పోలీస్ శాఖలో ప్రకంపలను పుట్టించింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు ప్రాథమికంగా వ్యక్తమౌతున్నాయి
టీడీపీ మాజీమంత్రిపై కేసు: రైతు దీక్షలకు మద్దతుగా రహదారి దిగ్బంధం: ప్రొటోకాల్ ఉల్లంఘన
కర్ణాటక సీఐడీలో డీఎస్పీగా..
మృతురాలి పేరు లక్ష్మి. ఆమె స్వస్థలం కోలార్ జిల్లాలోని మాలూరు మండలం మాస్తి గ్రామం. బెంగళూరులోని కోణనకుంటెలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదివరకు ఆమె బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లో పనిచేశారు. 2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె ఎంపిక అయ్యారు. అనంతరం 2017లో పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం కర్ణాటక సీఐడీలో డీఎస్పీగా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె సెలవుల మీద ఉంటున్నారు. ఆమె తండ్రి బీబీఎంపీలో ఉన్నతస్థానంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది
స్నేహితురాలి ఇంట్లో..
బుధవారం రాత్రి ఆమె బెంగళూరు నాగరభావిలోని వినాయక లేఔట్లో గల తన స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన ఓ మందుపార్టీలో పాల్గొన్నారు. అక్కడే తనకు కేటాయించిన ప్రత్యేక గదిలో లక్ష్మి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితురాలు అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
మద్యం అలవాటు.. ?
ఉద్యోగంలో చేరడానికి ముందే.. అంటే 2012లో లక్ష్మి వివాహమైంది. ఆమె భర్త పేరు నవీన్. హైదరాబాద్లో ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తరచూ బెంగళూరుకు వస్తుంటారు. వారిది ప్రేమ వివాహం. వారికి పిల్లలు లేరు. లక్ష్మీకి మద్యం సేవించే అలవాటు ఉందని, ఆ కారణంగా కొంతకాలంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. మద్యం అలవాటును మానుకోవడానికి ఇటీవలే కౌన్సెలింగ్ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు.
రెండేళ్లుగా భర్తకు దూరంగా..
మద్యం అలవాటు వల్ల కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ కారణం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెండేళ్లుగా లక్ష్మీ.. తన భర్తకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మద్యం అలవాటును మానుకోకపోవడం వల్ల భర్త నవీన్.. ఆమెతో కలిసి ఉండట్లేదని తెలుస్తోంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తతో దూరంగా ఉండాల్సి రావడం, పిల్లలు కలగకపోవడం వంటి పరిణామాలతో ఆమె మద్యానికి మరింత అలవాటు పడ్డారని, దీనితో డిప్రెషన్ గురై.. ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని స్నేహితులు చెబుతున్నారు.