కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!
బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడాన్ని భరించలేకపోయాడు. కత్తితో పొడిచి చంపాడు. కర్ణాటకలోని మండ్య జిల్లా రాగిముద్దేనహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు.
మృతురాలి పేరు వీణ. 26 సంవత్సరాలు. మండ్య జిల్లాలోని రాగిముద్దేన హళ్లిలో భర్త, అత్తామామలతో కలిసి నివసిస్తున్నారు. మండ్య జిల్లాకే చెందిన వీణకు ఆరేళ్ల కిందట రాగిముద్దేనహళ్లికి చెందిన అనిల్ తో వివాహమైంది. వీణ దంపతులకు ఇద్దరు పిల్లలు. అనిల్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతను రోజూ జిల్లా కేంద్రమైన మండ్యకు రాకపోకలు సాగిస్తుంటాడు. వీణ రాగిముద్దేన హళ్లిలో టైలరింగ్ షాపును నిర్వహిస్తున్నారు.
వృత్తిరీత్యా అనిల్ తరచూ బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండేది. ఈ క్రమంలో నాగరాజు కన్ను వీణపై పడింది. ఆమెను లోబరచుకోవడానికి ప్రయత్నించాడు. అతని ఉద్దేశాన్ని పసిగట్టిన వీణ రాగిముద్దేనహళ్లిలోనే భర్త, పిల్లలతో కలిసి వేరే ఇంటికి మారారు. దీనితో నాగరాజు తరచూ వీణతో కూడా గొడవ పడుతుండేవాడు. ఆదివారం ఉదయం అతను వీణ టైలరింగ్ షాపునకు వెళ్లాడు. వీణను మరోసారి లోబరచుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించారు. ఆగ్రహానికి గురైన నాగరాజు ఆమెను పొడిచి చంపాడు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీణను చూసిన స్థానికులు మండ్య రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యోదంతంలో నాగరాజు స్నేహితుడు ప్రకాశ్ అనే వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.