కర్ణాటక అసెంబ్లీ మధ్యాహ్నం 3.30 వరకు వాయిదా: విరామంలో ఏం జరుగుతుందో?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ శనివారం మధ్యాహ్నం 3.30గంటల వరకు వాయిదా పడింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభను 3.30గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకట్రించారు ప్రొటెం స్పీకర్ బోపయ్య.
ఇప్పటి వరకు 207మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. మిగితా వారు కూడా ప్రమాణం చేసిన తర్వాత సభను వాయిదా వేస్తారు. అనంతరం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జగరనుంది. సుప్రీం ఆదేశాల మేరకు మీడియా ఛానళ్లు కూడా అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించడంతో బీఎస్ యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. గవర్నర్ బీజేపీకే అవకాశం ఇవ్వడంతో ఆ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణ చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో బీజేపీ బలపరీక్షను ఎదుర్కోనుంది.
అయితే, ఈ విరామ సమయంలోనే బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు స్పష్టం చేశాయి. అసెంబ్లీలో బీజేపీ సభ్యులతో మాట్లాడకూడదని, అటువైపు వెళ్లకూడదని తేల్చి చెప్పాయి. అయితే, సాయంత్రం 4గంటల తర్వాతే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.