కర్ణాటకలో ఉప ఎన్నికల వేడి: మాజీ ఎమ్మెల్యేలకు తాజా షాక్: పాత షెడ్యూల్ ప్రకారమే పోలింగ్..!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వం కుప్పకూలిపోయేలా తిరుగుబాటు బావుటా ఎగరేసిన తాజా మాజీ శాసన సభ్యులకు సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తమ రాజీనామాలను ఆమోదిస్తూ ఇదివరకు అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశించింది. పోలింగ్ షెడ్యూల్ లో సైతం ఎలాంటి మార్పులు చేయకూదని సూచించింది. ఫలితంగా- ఇదివరకు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి.
షెడ్యూల్ లో మార్పు లేదని స్పష్టం..
నిజానికి- మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు తిరుగుబాటు ఎమ్మెల్యేలు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆ కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పోలింగ్ ను వాయిదా వేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తరువాత పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా- తిరుగుబాటు చేసిన తాజా మాజీ ఎమ్మెల్యేల పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పాత షెడ్యూల్ లోనే ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది.
5న పోలింగ్.. 9న కౌంటింగ్..!
ఈ విషయాన్ని కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేెకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత షెడ్యూల్ వివరాలను ప్రకటించారు. వచ్చేనెల 5వ తేదీన 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల 9వ తేదీన కౌంటింగ్ ఉంటుందని అన్నారు. ఉప ఎన్నికలను నిర్వహించనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని చెప్పారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలివే..
ఉప ఎన్నికలను నిర్వహించబోయే ఉప ఎన్నికల జాబితాను సంజీవ్ కుమార్ విడుదల చేశారు. హొస్కొటే, యశ్వంత్ పురా, శివాజీ నగర్, గోకక్, అథణి, కగ్వాడ, విజయనగర, హిరేకరూరు, రాణి బెన్నూరు, యల్లాపుర, కృష్ణరాజ పుర, మహాలక్ష్మి లేఅవుట్, చిక్ బళ్లాపుర, హుణసూరు, కృష్ణరాజ పేటేలల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 4,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అత్యధికంగా యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో 461, అత్యల్పంగా శివాజీ నగర పరిధిలో 193 పోలింగ్ స్టేషన్లు ఉంటాయని అన్నారు. కాగా- రాజరాజేశ్వరి నగర, మస్కిలల్లో ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
తిరుగుబాటు చేసిన తాజా మాజీ ఎమ్మెల్యేలు వీరే..
ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరాం హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, బైరాతి బసవరాజ్, ఆనంద్ సింగ్, ఆర్ రోషన్ బేగ్, మునిరత్న, కే సుధాకర్, ఎంటీబీ నాగరాజ్, శ్రీమత్ పాటిల్, రమేష్ జార్ఖిహోళి, మహేష్ కుమటళ్లి, ఆర్ శంకర్ రాజీనామాలను చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) పార్టీలకు చెందిన ఆయా ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తడం వల్లే హెచ్ డీ కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం 14 నెలల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. అనంతరం యడియూరప్ప ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటైంది