షాక్: రెండు రోజుల్లో పోలింగ్, బీజేపీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లోకి జంప్, సీఎం భార్యకు జై!
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్. చంద్రశేఖర్ ఆయన్ను నమ్మిన నాయకులకు హ్యాండ్ ఇచ్చి ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో చంద్రశేఖర్ ఇచ్చిన షాక్ కు బీజేపీ నాయకులు హడలిపోయారు. ఉప ఎన్నికల్లో తాను సీఎం భార్యకు మద్దతు ఇస్తున్నానని బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ బహిరంగంగా ప్రకటించారు.
మాజీ మంత్రిని కాదని!
శాసన సభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి యోగీశ్వర్ ను కాదని చంద్రశేఖర్ కు టిక్కెట్ ఇచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిపోవడంతో రామనగర శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
సీఎం సతీమణి పోటీ
రామనగర శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనితా కుమారస్వామి గెలుపు కోసం స్వయంగా సీఎం కుమారస్వామి రామనగరలో ప్రచారం చేశారు.
నమ్మి టిక్కెట్ ఇచ్చారు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి దూరం చెయ్యడంతో అదే ప్రాంతానికి చెందిని ఆ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ నెల రోజుల క్రితం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన చంద్రశేఖర్ మీద నమ్మకంతో ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆయనకు మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అవకాశం ఇచ్చారు.
ఊహించని షాక్
ఇంతకాలం బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసిన చంద్రశేఖర్ రెండు రోజుల్లో (నవంబర్ 3) పోలింగ్ జరుగుతున్న సమయంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ లో చేరిపోయి అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ దెబ్బతో బీజేపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు.
ఓటు ఎవరు వేస్తారు ?
బీజేపీ నాయకులు ప్రచారం చెయ్యడానికి రావడంలేదని, ఫోన్ లో వారిని సంప్రధించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడంలేదని, నాయకులు ప్రచారానికి రాకపోతే కార్యకర్తలు ఓటు ఎలా వేస్తారని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని చంద్రశేఖర్ మీడియాతో చెప్పారు.
కాంగ్రెస్ భారీ డీల్?
ఎమ్మెల్యే ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిపోయాడని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు రామనగర బీజేపీ కార్యాలయం ముందు గుమికూడి ఆందోళనకు దిగారు. చంద్రశేఖర్ నమ్మించి బీజేపీకి ద్రోహం చేశారని, కాంగ్రెస్-జేడీఎస్ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మొత్తం మీద చంద్రశేఖర్ చేసిన పనికి రామనగరలో బీజేపీ అభ్యర్థి లేకుండానే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.