నేను లోకల్ అన్న జేడీఎస్.. రాహుల్ బేఖాతరు.. అదే కొంపముంచిదా?
బయటి వ్యక్తులు బరిలోకి దూకేటప్పుడు స్థానిక బలాన్ని అంచనా వేయాలి అనే విషయాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా విస్మరించారు. అందుకే చేతిలోకి వచ్చే అధికారాన్ని జార విడుచుకొని ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. గత నాలుగేళ్లలో పరాజయాలు రాహుల్కు పాఠాలు నేర్పినట్టు కనిపించడం లేదు. కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్తో పొత్తు పెట్టుకొంటే అధికార తమదే అని రాహుల్కు స్థానిక కాంగ్రెస్ నేతలు సూచించారు. అయితే నేతల సలహాలను పెడచెవిన పెట్టి ఒంటరిగానే బరిలోకి దూకింది కాంగ్రెస్. దాంతో కర్ణాటకలో అధికార పీఠానికి దూరం కావాల్సి వచ్చింది.
సత్తా చాటలేకపోతున్న రాహుల్
కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ ఒక్కరే పార్టీకి ప్రధాన ఆకర్షణగా మారారు. ప్రచారంలోనూ, వ్యూహా రచనలోనూ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలపేతం చేస్తున్నారు. కానీ పార్టీని అధికారం దిశగా నడిపించే సత్తాను చాటలేకపోతున్నారు. గత నాలుగేళ్లలో ఏన్నో రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది.
అతివిశ్వాసమే కారణమా?
కర్ణాటక, గుజరాత్లో పార్టీని అధికారం వైపు నడిపించడంలో కాంగ్రెస్ విఫలం కావడానికి రాహుల్ గాంధీ అతివిశ్వాసమే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడంలో రాహుల్ విఫలమయ్యాడని ఆరోపణలు లేస్తున్నాయి. కర్ణాటకలో జేడీఎస్తో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకొంటే తాము అధికారాన్ని చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉండేవని చెబుతున్నారు.
గుజరాత్లో బెడిసికొట్టిన వ్యూహం
గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొనేందుక బీఎస్పీ, ఎన్సీపీ ముందుకొచ్చాయి. సీట్ల కేటాయింపులో బేరసారాలు జరిపాయి. కానీ కాంగ్రెస్ చొరవ చూపకపోవడంతో పొత్తు వీలుపడలేదు. కాంగ్రెస్, ఇతర పార్టీల బలహీనతలను ఉపయోగించుకొని గుజరాత్లో మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీఎస్పీ, ఎన్సీపీ ఓట్ల చీలికతో 12 సీట్లు తక్కువ కావడంతో అధికార పీఠానికి కాంగ్రెస్ దూరమైంది.
జేడీఎస్తో పొత్తు పెట్టుకొంటే ఫలితం
గుజరాత్ వైఫల్యాన్ని అధిగమించి కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకొని ఉంటే గ్యారంటీగా కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వచ్చేవనే మాట వినిపిస్తుంది. జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కూటమికి 150 సీట్లు వచ్చేవని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రాహుల్ను తప్పుదారి పట్టించారా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత లేదు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఎదురుగాలి విస్తోందనే వాదనను రాహుల్ ఎదుట సీఎం సిద్ధరామయ్య, ఇతర నేతలు వినిపించారనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అందుకే జేడీఎస్తో పొత్తుకు రాహుల్ ఆసక్తి చూపనట్టు ప్రచారం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉంటే కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకొనే అవకాశం ఉండేదని చెప్పుకొంటున్నారు.
వందేళ్ల కాంగ్రెస్కు మరో చేదు అనుభవం
ఎన్నికల ఫలితాల తర్వాత జేడీఎస్ బలమేంటో కాంగ్రెస్కు అర్థమైంది. అప్పటికే చేతులు కాలడంతో ఒకరకంగా వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఆ పార్టీతో కాళ్లబేరానికి వచ్చింది. 37 స్థానాలు గెలుచుకొన్న కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టేందుకు రాహుల్ బృందం ముందుకొచ్చింది. ఇది కాంగ్రెస్ లోపభూయిష్టమైన నిర్ణయాలకు నిదర్శనంగా మారింది.
ఏకమైన బీజేపేతర శక్తులు
కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా ఉన్న బీజేపేతర శక్తులు ఏకమయ్యాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాయవతి, ఇతర నేతలు దేవగౌడతో మంతనాలు జరిపారు. బీజేపీకి దగ్గరకాకుండా కాంగ్రెస్ నేతలు కొంత రాజీపడి అధికారాన్ని కట్టబెట్టేందుకు ముందుకు వచ్చారు.