మోడీగారు మీకు ఓట్లు వేసేది శునకాలు కాదు, మనుషులు, నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్, వివాదం!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు ఓట్లు వేసేది శునకాలు (కుక్కలు) కాదు, మనుషులు అని చెప్పిన బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ మరో వివాదానికి తెరలేపారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్టర్ లో రెండు వీడియోలు పోస్టు చేసిన ప్రకాష్ రాజ్ బీజేపీకి ఓటు వెయ్యకూడదని కన్నడిగులకు మనవి చేశారు.
ప్రధాని మోడీకి జవాబు
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బాగల్ కోటేలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉత్తర కర్ణాటకలోని ముధోల్ కు చెందిన శునకాలు సైన్యంలో సేవలు అందిస్తున్నాయని, వాటిని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ భక్తిని నేర్చుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలతో మీకు ఓట్లు వేసేది శునకాలు కాదని, మనుషులు అని ప్రకాష్ రాజ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
దళితుల ఆశాకిరణం
తాను దళితుల ఆశాకిరణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారని, జిగ్నేష్ మేవాని హిందూ వ్యతిరేకి అని ఆయనే అంటారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. జిగ్నేష్ మేవాని దళిత నాయకుడు, ఎన్నికలు సమీపించే సమయంలో మీరు ఓక్కరోజు దళితుల ఇంటిలో భోజనం చేస్తే మీరు దళిత నాయకుడు అయిపోతారా అని ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీ నాయకులను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
ప్రేమికుల రోజు దాడులు
ఫిబ్రవరి 14వ తేదీ (ప్రేమికుల రోజు) యువతి, యువకుడు జంటగా కనపడితే దాడులు చేస్తారని, వాళ్లు అన్నా, చెల్లెలా, భార్య, భర్తనా అని కనీసం ఆలోచించరని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఫిబ్రవరి 14వ తేదీ యువతి, యువకుల మీద దాడులు చేసిన వారి మీద కేసులు మాత్రం ఎందుకు నమోదు కావని ప్రధాని మోడీని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
పాపం అమాయకులు
ప్రధాని నరేంద్ర మోడీ మీద తనకు చాల అనుమానాలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను అడిగే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పకుండా పదేపదే అపద్దాలు చెబుతున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. పాపం అమాయక ప్రజలకు మీ జీడీపీ-పీడీపీ మాటలు అర్థం కావడం లేదని, వారికి అర్థం అయ్యేది మా ఇంటి బిడ్డకు ఇంత వరకూ ఎందుకు ఉద్యోగం రాలేదు అనే విషయం మాత్రమే అని ప్రకాష్ రాజ్ అన్నారు.
అన్నం తింటే పన్ను
బ్యాంకుకు వెళ్లి మా అకౌంట్ లో ఉన్న నగదు డ్రా చేసేకోవడానికి వీలుకావడం లేదని, హోటల్ కు వెళ్లి మేము తినే అన్నంకు 18 శాతం పన్ను ఎందుకు చెల్లించాలని అని సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తనకు ఎవరిమీద ద్వేషం లేదని, తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, మీరు చేస్తున్న పనులు మంచివి కావని, అందుకే ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నానని ప్రధాని మోడీని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని మీరు నమ్మకూడదని ప్రజలకు ప్రకాష్ రాజ్ మనవి చేశారు.
Recommended Video
ప్రధాని గౌరవం నిలుపుకోవాలి
సైన్యంలోని ముధోల్ శునకాలను చూసి మేము దేశభక్తిని నేర్చుకోవాలా, కర్ణాటక ఎన్నిక సందర్బంగా ఇక్కడికి వచ్చి శునకాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారా, మీకు ఓటు వేసేది శునకాలు కాదు, యువకులు, రైతులు, మహిళలు, మీ వయసుకు, మాటలకు, ప్రధాని అనే పదవికి గౌరవం నిలుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకాష్ రాజ్ సూచించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన మీద మండిపడుతున్నారు.