రాహుల్ గాంధీ టెంపుల్ రన్: బెంగళూరులో ఆలయాలు, దర్గాలు, చర్చిలు తీరుగుతున్న యువరాజు!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్బంగా టెంపుల్ రన్ కు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు బెంగళూరు నగరంలో ఆలయాలు, దర్గాలు, చర్చిలు తిరుగుతున్నారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, ఆలయాలు సందర్శించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యాలని రాహుల్ గాంధీ మనవి చేస్తున్నారు.
రాహుల్ గాంధీ మాస్టర్ ప్లాన్
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాలుగు బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాస్టర్ ప్లాన్ వేసి బెంగళూరులో మకాం వేసి ప్రార్థనా మందిరాలు, ఆలయాలు సందర్శించి ఓట్లు వేయాలని వేడుకుంటున్నారు.
బిషప్ ఆశీర్వాదం
మంగళవారం రాత్రి చర్చికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిషప్ బర్నాడ్ మోరస్ ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత అక్కడే ఉన్న క్రైస్తవ సోదరులతో భేటీ అయిన రాహుల్ గాంధీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారు.
దోడ్డ గణపతి ఆలయం
బుధవారం బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని ప్రసిద్ది చెందిన దోడ్డ గణపతి (పెద్ద గణపతి) ఆలయానికి వెళ్లిన రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాలయంకు వచ్చిన భక్తులకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యాలని రాహుల్ గాంధీ వేడుకున్నారు.
చిక్కపేట దర్గా
దోడ్డ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ చిక్కపేటలోని హజరత్ తౌకల్ మస్తాన్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని ముస్లీం సోదరులకు రాహుల్ గాంధీ మనవి చేశారు. దర్గా పెద్దలు, హజరత్ లతో రాహుల్ గాంధీ చర్చించారు.
గార్మెంట్స్ మహిళా ఉద్యోగులు
టెంపుల్ రన్ పూర్తి అయిన తరువాత రాహుల్ గాంధీ గార్మెంట్స్ ఫ్యాక్టరీల మహిళా ఉద్యోగులతో భేటీ అయ్యి వారి సమస్యలు అడిగి తెలసుకున్నారు. వారి జీతాలు, జీవితం ఎలా గడుస్తోందని అని సమాచారం తెసుకున్న తరువాత మీరు మద్దతు ఇస్తే కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, మీ సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తామని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.