గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు క్షమించారు, రాష్ట్రం క్షేమం అంటే, బీజేపీకి సిద్దూ ప్రశ్నలు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా శుక్రవారం బీజేపీ నాయకులకు చురకలు అంటించారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకలోని కరావళి (సముద్ర తీర ప్రాంతాలు) విషయంలో బీజేపీ నాయకులకు అనేక ప్రశ్నలు వేశారు. గాలి జనార్దన్ రెడ్డిని మీరు ఎందుకు క్షమించారు, రాష్ట్రం క్షేమం అంటే ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు.
గాలి జనార్దన్ రెడ్డిని క్షమించాను
కర్ణాటక రాష్ట్రం క్షేమం కోసం తాను గాలి జనార్దన్ రెడ్డిని క్షమించానని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప చెప్పారని ఓ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురించారు. ఈ వార్తను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గమనించారు.
రాష్ట్రం క్షేమం అంటే ఏమిటి ?
బీఎస్. యడ్యూరప్ప వ్యాఖ్యలకు శుక్రవారం సీఎం సిద్దరామయ్య వరుసగా ట్వీట్ లు చేస్తూ పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రం క్షేమం అంటే ఏమిటీ, గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు క్షమించారు అంటూ బీఎస్. యడ్యూరప్పను ప్రశ్నించారు.
సీబీఐకి సూచించాలా !
ప్రధాని నరేంద్ర మోడీని సీబీఐకి సూచించి గాలి జనార్దన్ రెడ్డిని క్షమించమని చెప్పాలని మీరు ఈ విదంగా అడిగారా ? అని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియాలో వ్యంగంగా ప్రశ్నించారు.
ఆశ్చర్యంగా ఉంది
రాష్ట్రం క్షేమం కోసం గాలి జనార్దన్ రెడ్డిని యడ్యూరప్ప క్షమించడం చూస్తుంటే చాల ఆశ్చర్యంగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి వ్యంగంగా ట్వీట్ చేశారు. బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు గెలుపు కోసం గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని అస్త్రంగా చేసుకున్న సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్ లు చేస్తూ బీజేపీ నాయకులకు ప్రశ్నల వర్షం కురిపించారు.
బీజేపీ మనుషుల విరోధి
కర్ణాటకలోని కరావళి (సముద్ర తీర ప్రాంతాలు)ల్లో గత ఎన్నికల్లో మూడు లోక్ సభ నియోజక వర్గాల్లో చట్టాలను వ్యతిరేకించే వారు మాత్రమే కాదు, మనుషుల విరోధులను ప్రజలు గెలిపించి చాల పెద్ద తప్పు చేశారని బీజేపీ ఎంపీల మీద సిద్దరామయ్య మండిపడుతూ ట్వీట్ చేశారు.
మన పరువు తీస్తున్నారు
బీజేపీ నాయకులకు ప్రజలు ప్రశాంతంగా ఉండంటం ఇష్టం లేదు, వాళ్లు కొట్టుకొని చంపుకోవాలి, వారి చనిపోయిన తరువాత రాజకీయాలు చెయ్యాలని చూస్తారని సిద్దరామయ్య ట్వీట్టర్ లో ఆరోపించారు. కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉగ్రవాదులు, జీహాదీలు ఉన్నారని ఆరోపిస్తూ ఆ ఊరితో పాటు కర్ణాటక పరువు తీస్తున్నారని సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.