బీజేపీకి కర్ణాటక అసెంబ్లీ ప్రయోగశాల, ఆటలు ఆడుతోంది, మాజీ సీఎం సిద్దూ, ప్రజాస్వామ్యం !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ (అసెంబ్లీ) బీజేపీ పాలిట ప్రయోగశాల (ల్యాబ్) అయ్యిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, ఇది చట్ట వ్యతిరేకమని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. శుక్రవారం సోషల్ మీడియాలో బీజేపీ తీరును సిద్దరామయ్య విమర్శించారు. మెజారిటీ లేకుండానే బీజేపీ అడ్డదారిలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని, ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుతోందని సిద్దరామయ్య ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం
కర్ణాటకలో శుక్రవారం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. గవర్నర్ వాజూబాయ్ వాలాను బీఎస్. యడియూరప్ప కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మనవి చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బీఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బీజేపీకి గవర్నర్ మద్దతు
బీజేపీకి మద్దతు ఇస్తున్న గవర్నర్ వాజూబాయ్ వాలా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీఎస్. యడియూరప్పకు అవకాశం ఇచ్చారని సిద్దరామయ్య విమర్శించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతులేని యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి గవర్నర్ వాజూబాయ్ వాలా ఎలా అవకాశం ఇచ్చారు ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు.
105 మంది ఎమ్మెల్యేలు
చట్టప్రకారం బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదని సిద్దరామయ్య అంటున్నారు. ప్రజాస్వామ్యం మీద బీజేపీకి నమ్మకం లేదని సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే బీజేపీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీ ఎమ్మెల్యేలు లేరని సిద్దరామయ్య చెప్పారు.
111 మంది ఎమ్మెల్యేలు కావాలి
కర్ణాటక శాసన సభలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసన సభలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కోలారు జిల్లా ముళబాగిల్ శాసన సభ్యుడు బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకి 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. అయితే అధికారంలోకి రావడానికి బీజేపీకి 111 మంది ( ముగ్గురు శాసన సభ్యుల మీద అనర్హత వేటు పడిన తరువాత) ఎమ్మెల్యే మద్దతు కావాలని సిద్దరామయ్య గుర్తు చేశారు.
అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు
స్పీకర్ రమేష్ కుమార్ గురువారం ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడిన తరువాత కర్ణాటక శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 221కి పడిపోయింది. ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 111 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇద్దరు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ కు 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీఎస్ కు 37 మంది (రాజీనామాలు చేసిన వారితో కలిపి), బీఎస్ పీకి 1, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే 1 ఉన్నారు.