బీజేపీకి 104 లేదా 120 ఎమ్మెల్యేలా: కాంగ్రెస్, జేడీఎస్ కు అదే అనుమానం, ఆ ఎమ్మెల్యేల ఓటు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మా 78 మంది శాసన సభ్యులు మాతోనే ఉన్నారని, ఎక్కడికి వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటోంది. జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేశారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారో ఇప్పటికీ క్లారిటీ లేదు. బీజేపీ మాత్రం బలపరీక్షలో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతోంది. మాకు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ ధీమాగా చెబుతోంది.
16 మంది రెబల్ ఎమ్మెల్యేలు
బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని సమాచారం. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, సీఎం బీఎస్ యడ్యూరప్ప బలపరీక్షలో సులభంగా విజయం సాధిస్తారని బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, జేడీఎస్ కు అనుమానం
బీజేపీ మాకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మా ఎమ్మెల్యేలు అందరూ మాతోనే ఉన్నారని అంటోంది. అయితే కాంగ్రెస్, జేడీఎప్ పార్టీలకు ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందో అనే అనుమానం, భయం వారిని వెంటాడుతోంది.
ఈ ఎమ్మెల్యేలు ఎటువైపు
కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్, హుమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే నాగేంద్ర, అఫజల్ పూర్ ఎమ్మెల్యే ఎం.వై. పాటిల్ ఎవరికి ఓటు వేస్తారు అని ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ప్రమాణస్వీకారం
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత విప్ జారీ చేస్తే తమ పదవులు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చెయ్యకుండా చిన్నగా తప్పించుకుని ఓటింగ్ లో పాల్గొనకుంటే తరువాత కథ తరువాత చూద్దామని కొందరు ఆలోచిస్తున్నారని సమాచారం.