కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన ఈసీ: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఢీ, అధికారం!
Recommended Video
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్చి 27వ తేదీ మంగళవారం ప్రకటించింది. 2018 మే 12వ తేదీ పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మే 15వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశం మొత్తం ఇప్పుడు మే 15వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా గమనిస్తోంది.
శాసన సభ నియోజక వర్గాలు
కర్ణాటకలో మొత్తం 224 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఒకేరోజు అన్ని నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ తేది ప్రకటించిన తరువాత ఎన్నికల నియమావలి అమలులోకి వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ ధీమా
కర్ణాటకలో గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపడుతామని ధీమాతో ఉంది. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ, జేడీఎస్
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, జేడీఎస్ గట్టిపోటి ఇస్తున్నాయి. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపిస్తామని బీజేపీ, జేడీఎస్ నాయకులు అంటున్నారు.
2013 సీన్ రిపీట్ !
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.
2017,2018లో అదృష్టం
2017లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించనిరీతిలో అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018 మార్చిలో త్రిపురలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్షాలను ఇంటికి పంపించిన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ కర్ణాటకలో కూడా ఉపయోగపడుతోందని బీజేపీ నాయకులు కలలుకంటున్నారు.